ఉక్రెయిన్ లో ప్రకాశం జిల్లా విద్యార్థులు.. ఆందోళనలో పేరెంట్స్

తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది విద్యార్థులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. అక్కడ చిక్కుకున్న వారిని ఎలాగైనా

Update: 2022-02-25 11:18 GMT

ప్రకాశం : ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్ నగరాన్ని రష్యా బలగాలు హస్తగతం చేసుకుంటున్నాయి. కీవ్ పై దాడి చేసిన రష్యా బలగాలు.. అక్కడి ఉక్రెయిన్ కార్యాలయాలపై తమ దేశపు జెండాను ఎగురవేశాయి. 96 గంటల్లో రష్యా కీవ్ నగరాన్ని ఆక్రమించేసుకుంటుందని ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రష్యాను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ పోరాడుతున్నా.. ఆర్మీ సైన్యాన్ని ఆపలేకపోతోంది. ఉక్రెయిన్ లో భీకర వాతావరణం ఉన్న నేపథ్యంలో చదువు కోసం వెళ్లి.. పరాయి దేశంలో చిక్కుకున్న తమ పిల్లలు ఎలా ఉన్నారో? ఎప్పుడేం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది విద్యార్థులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. అక్కడ చిక్కుకున్న వారిని ఎలాగైనా స్వ రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర మంత్రులు ప్రయత్నిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు సాయిబాబా నగర్ కు చెందిన సంపత్, బలరాంకాలనీకీ చెందిన పుట్టా సాయి లక్ష్మి జశ్వంత్, అద్దంకి నియోకవర్గంలో మరో ముగ్గురు విధ్యార్ధులు యుక్రెయిన్ లో చిక్కుకుపోయారు. వీఎన్ కరాజీన్ కార్కివ్ యూనివర్సిటీలో ఇద్దరు విధ్యార్ధులు ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆందోళన చెందొద్దని, నెట్ వర్క్ ఆగిపోతున్న కారణంగా శనివారం ఉదయం కాల్ చేస్తామంటూ తల్లిదండ్రులకు విద్యార్థులు తెలియచేశారు. నెట్ వర్క్ ఆగిపోవడం.. వారి వారి ఫోన్ నెంబర్లు పనిచేయక పోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పీఎం మోదీ వెంటనే చొరవ తీసుకుని తమ వారిని సురక్షితంగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.





Tags:    

Similar News