వేల కోట్లు ఎగ్గొట్టి...విదేశాల్లో రేసులా?

Update: 2017-02-23 13:30 GMT

వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పలాయనం చిత్తగించిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ విజయ్ మాల్యా మళ్లీ కన్పించారు. ఫార్ములా వన్ రేసు కు సంబంధించి బ్రిటన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాల్యా పాల్గొన్నారు. మాల్యా పాల్గొన్న ఫోటోలను ఫార్ములా వన్ తన వెబ్ సైట్ లో పెట్టడంతో మళ్లీ మాల్యా కన్పించినట్లయింది. బ్యాంకుల వద్ద తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణం తీసుకుని ఎగ్గొట్టిన మాల్యా విదేశాలకు పారిపోయిడు. ఆయన ఆస్తులను కొన్నింటిని ఇక్కడ బ్యాంకులు జప్తు కూడా చేశాయి. అయితే మాల్యా మాత్రం తాను పారిపోలేదని త్వరలోనే భారత్ కు వస్తానని చెబుతున్నాడు. న్యాయస్థానం కూడా మాల్యాకు నోటీసులు జారీ చేసింది. కాని మాల్యా నోటీసులకు కూడా స్పందించలేదు.

ఫార్ములా వన్ రేసులో....

ఇప్పుడు హటాత్తుగా ఫార్యులా వన్ రేసులో మాల్యా ఫొటోలకు ఫోజులిస్తూ కన్పించాడు. బ్రిటన్ లో జరుగుతున్న ఈ రేసుల్లో మాల్యా కు చెందిన సహారా ఫోర్స్ ఇండియా కూడా పోటీ చేస్తుండటంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తన టీమ్ కు చెందిన కొత్త కారును మాల్యా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాల్యా భారత్ మీడియాను కూడా టార్గెట్ చేశారు. ఫార్ములా వన్ రేసులో భారత్ కు చెందిన పారిశ్రామికవేత్త టీం పాల్గొనడం గర్వకారణం కాదా? ఇది మీడియాకు కనపడదా? అని ప్రశ్నించారు మాల్యా. అయితే బ్రిటన్ ను వదిలి మాల్యా వచ్చేలా లేడు. తనను భారత్ కు రప్పించేందుకు వారి వద్ద తగిన కారణాలేవీ లేవని మాల్యా చెబుతున్నారు. తాను బ్రిటన్ ను వదిలిపెట్టేది లేదని మాల్యా తెగేసి చెప్పారు. అయితే భారత విదేశాంగ శాఖ మాత్రం మాల్యాను భారత్ కు రప్పించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బ్రిటన్ అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతూనే ఉంది. కాని మాల్యా మాత్రం బ్రిటన్ లో చట్టపరమైన ధృఢ నిర్ణయాలు ఉంటాయని, భారత అధికారుల వద్ద తనకు సంబంధించిన సాక్ష్యాలేవీ లేని మాల్యా మొండితనంతో చెబుతున్నారు. మొత్తం మీద మాల్యా మళ్లీ ఫార్ములా వన్ రేసులో దర్శనమివ్వడంతో వార్తల్లో కెక్కారు విజయ్ మాల్యా.

Similar News