రా తేల్చుకుందాం... టీడీపీ ఎమ్మెల్యేకి మంత్రి సవాల్

Update: 2017-01-25 08:15 GMT

‘నా నియోజకవర్గంలోకి వస్తావా? రా...నేనేంటో చూపిస్తా. రా తేల్చుకుందాం. ఎస్సీ నియోజకవర్గమని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు’ అని ఏపీ మంత్రి పీతల సుజాత విప్ చింతమనేని ప్రభాకర్ పై మండిపడ్డారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య కొట్లాటలున్నాయనేది ఈ ఘటనతో స్పష్టమైంది. దీంతో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

అసలు గొడవ ఎలా స్టార్ట్ అయిందంటే... చింతలపూడి నియోజకవర్గానికి మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే చింతలపూడిలో కొందరు ఒక సినిమా థియేటర్ ను నిర్మించుకున్నారు. ఆ థియేటర్ ప్రారంభోత్సవానికి మంత్రి పీతల సుజాతకు నిర్వాహకులు ఆహ్వానం పంపలేదు. అదే జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఆహ్వానం పంపారు. చింతమనేని చేతుల మీదుగానే థియేటర్ ను ప్రారంభించారు నిర్వాహకులు. ఇది మంత్రికి నచ్చలేదు. తన నియోజకవర్గంలో వేరే ఎమ్మెల్యే ఎలా ప్రారంభోత్సవాలు చేస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు. కేవలం ఎస్సీ నియోజకవర్గమనే చిన్నచూసు చూస్తున్నారని ఆరోపించారు. చింతమనేని మాత్రం థియేటర్ ప్రారంభోత్సవానికి నిర్వాహకులు ఆహ్వానిస్తేనే వెళ్లానని, దీనికి మంత్రిగారి అనుమతి అవసరం లేదని సమాధాన మిచ్చారు. దీంతో ఇరువురి మద్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఇన్ ఛార్జి మంత్రి అయ్యన్న పాత్రుడు ఇద్దరికీ సర్ది చెప్పి సమాశాన్ని ముగించారు.

Similar News