మోడీ సెంచరీ కొట్టేశారు...!

Update: 2017-12-22 12:22 GMT

ఎట్టకేలకు మోడీ సెంచరీ కొట్టేశారు. గుజరాత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్రధాని మోడీ అంతా తానై అయి ప్రచారం చేశారు. నిజానికి మోడీ ప్రచారం వల్లనే గుజరాత్ లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. పూర్తి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గుజరాత్ లో బీజేపీకి 99 స్థానాలు మాత్రమే దక్కాయి. అంటే డబుల్ డిజిట్ మాత్రమే. దీనిపై మోడీ కూడా పార్టీ అంతర్గత సమావేశంలో ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాజాగా డబుల్ డిజిట్ త్రిబుల్ డిజిట్ అయింది. మోడీ అనుకున్నట్లుగానే సెంచరీ కొట్టేశారు. 99 స్థానాలున్న గుజరాత్ బీజేపీకి స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు మద్దతు ప్రకటించారు. అదికూడా ఆయన కాంగ్రెస్ నుంచి రెబల్ గా పోటీ చేసిన వ్యక్తే కావడం విశేషం. కాంగ్రెస్ నుంచి టిక్కెట్ దక్కక పోవడంతో సెంట్రల్ నియోజకవర్గం నుంచి రతన్ సింగ్ రాథోడ్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈయనను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది కూడా. అయితే ఈయన విజయం సాధించారు. ఇప్పుడు బీజేపీకి బయటనుంచి మద్దతు తెలపడంతో బీజేపీ వంద సంఖ్యకు చేరుకుంది.

Similar News