పీఏ కు అండగానే బాలయ్య

Update: 2017-02-04 05:07 GMT

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ వ్యవహారం రోజురోజుకూ తీవ్రమవుతోంది. బాలకృష్ణ పీఏ శేఖర్ ను పంపించాల్సిందేనంటూ టీడీపీ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నెల 5వ తేదీన సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. బాలకృష్ణ పీఏ శేఖర్ దాష్టీకాన్ని తట్టుకోలేక పోతున్నామని గత కొన్ని రోజులుగా మండలస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు ఈనెల 5న హిందూపురం నియోజకవర్గంలో భారీ సమావేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికి మాజీ ఎమ్మెల్యే వెంకటరాముడు, టీడీపీనేతలు అంబికా లక్ష్మీనారాయణ తదితరులు నాయకత్వం వహిస్తున్నారు.

బాలయ్య బాబు అంటే తమకెంతో గౌరవమని, నందమూరి కుటుంబానికి, టీడీపీకి తాము వెన్నంటే ఉంటామంటున్నారు తెలుగు దేశం నేతలు. అయితే పీఏ శేఖర్ అరాచకాలను తట్టుకోలేకే రోడ్డున పడాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఎన్నిసార్లు టీడీపీ అధిష్టానానికి, బాలకృష్ణ కు చెప్పినా స్పందన లేకపోవడంతోనే మీటింగ్ లు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నామని చెబుతున్నారు. అయితే బాలకృష్ణ పీఏ విషయంపై ఆరా తీసినట్లు చెబుతున్నారు. శేఖర్ తో కూడా మాట్లాడినట్లు చెబుతున్నారు. అయితే బాలయ్య మాత్రం పీఏ శేఖర్ వైపునే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద బాలయ్య పీఏ వ్యవహారం అనంతపురం జిల్లా తెలుగుదేశం రాజకీయాలు హీటెక్కాయి.

Similar News