పవన్ కూడా రెడీ అయిపోయారు....! ఎక్కడి నుంచి అంటే...?

Update: 2017-11-06 13:30 GMT

జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇక పవన్ యాత్ర కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే డిసెంబర్ నెలలో పవన్ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఇందుకు రథం కూడా సిద్ధమవుతోందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. రథయాత్ర అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. అనంతపురం నుంచే పవన్ పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే రాళ్లసీమ, కరువు ప్రాంతమైన అనంతపురం నుంచి పవన్ తన యాత్రను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయ కర్తల ఎంపికను ప్రారంభించింది. డిసెంబర్ నాటికి ఇవి పూర్తవుతాయని జనసేన వర్గాలు తెలిపాయి.

తొలి విడత కేవలం జిల్లా కేంద్రాల్లోనే....

మరోవైపు పవన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తన యాత్ర కొనసాగుతుందని చెప్పారు. ముందగా ఏపీలో ఆ తర్వాత తెలంగాణలో పర్యటించేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బస్సును తయారు చేయిస్తున్నారు. బస్సులోనే విడిది చేసేటట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే పవన్ తన తొలి పర్యటనలో కేవలం జిల్లా కేంద్రాలనే టచ్ చేయాలని భావిస్తున్నారు. మధ్యమధ్యలో నియోజకవర్గాల్లో పవన్ ఆగి ప్రసగించే అవకాశం ఉంది. అప్పడు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నెలన్నర రోజుల్లో యాత్ర ముగిసే అవకాశం ఉంటుంది. ఎన్నికలకు ముందు ఏపీ, తెలంగాణలో తాము పోటీ చేసే నియోజకవర్గాల్లో మరోసారి పర్యటించాలని పవన్ భావిస్తున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ తయారు చేయాలని జనసేన నేతలను పవన్ ఆదేశించారు. ఇందుకోసం పోలీసుల అనుమతి ముందుగానే తీసుకుని పక్కాగా వెళ్లాలని పవన్ నిర్ణయించారు. ఎక్కడా అభిమానుల తొక్కిసలాట జరగకుండా ముందుగానే పోలీసుల నుంచి భద్రతను తీసుకోవాలని పవన్ భావిస్తున్నారు. దీనిపై మరో వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని జనసేన నేత ఒకరు చెప్పారు. మొత్తం మీద వచ్చే నెలలో పవన్ తన రథయాత్రను ప్రారంభించబోతున్నారు.

Similar News