దీప కొత్త పార్టీ పెడతారా?

Update: 2017-02-24 04:55 GMT

తమిళనాడులో ఈరోజు ఏం జరగబోతోంది. జయలలిత మేనకోడలు దీప కొత్త పార్టీని ప్రకటిస్తారా? లేక పన్నీర్ సెల్వంతో కలసిముందుకెళతారా? అన్నది తేలనుంది. జయ మరణం తర్వాత ఆమె వారసురాలిగా దీప తెరపైకి వచ్చారు. దీపకు అనూహ్యంగా మద్దతు పెరగడంతో పన్నీర్ సెల్వం కూడా దీపను దగ్గరకు తీశారు. ఆమె సాయంతో పార్టీకి పూర్వవైభవం తేవాలని భావిస్తున్నారు. పన్నీర్ సెల్వం, దీప ఇరువురూ ఇటీవల జయ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. తమిళనాడు రాజకీయ సంక్షోభం సమయంలో కూడా దీప పన్నీర్ కు అండగా నిలిచారు.

అయితే తాజా సమాచారం ప్రకారం దీప కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు ఆమె మద్దతుదారులు చెబుతున్నారు. దీప ఇంటివద్ద నిన్నటి నుంచే కోలాహలం నెలకొంది. కొత్త జెండాలు దీపి ఇంటి ఆవరణలో ఎగురుతున్నాయి. దీప కొత్త పార్టీ పెట్టి ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారని ఆమె మద్దతుదారులు గట్టిగా చెబుతున్నారు. జయలలిత జయంతి సందర్భంగా ఆమె కొత్త పార్టీ పేరును ప్రకటిస్తారా? పన్నీరు వెంట నడుస్తారా? అన్నది కొద్ది గంటల్లో తేలిపోనుంది. శుక్రవారం దీప, జయ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించిన తర్వాత కొత్త పార్టీ ప్రకటన ఉంటుందంటున్నారు ఆమె అభిమానులు.

Similar News