తమిళనాడు గవర్నర్ కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నారా? రాజ్ భవన్ లో ఏం జరుగుతోంది? తమిళనాడు ఇన్ ఛార్జి గవర్నర్ డీజీపీ, చీఫ్ సెక్రటరీలతో భేటీ అయ్యారు. తమిళనాడులో పరిస్థితులను గురించి తెలుసుకున్నారు. మరోవైపు న్యాయ నిపుణలతో కూడా విద్యాసాగర్ రావు చర్చించారు. కేంద్రానికి పంపిన నివేదికపై అక్కడి నుంచి త్వరలోనే సమాచారం వస్తుందని గవర్నర్ ఆశిస్తున్నారు. అయితే మరి కాసేపట్లో విద్యాసాగర్ రావు కీలక ప్రకటన చేయనున్నారన్న వార్తలు అందుతున్నాయి.
ఇరువర్గాల్లోనూ ధీమా...
ఇటు పన్నీర్ సెల్వం వర్గం, అటు శశికళ వర్గం గవర్నర్ నిర్ణయం తమకే అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ కు అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్ అవకాశమిస్తారని పన్నీర్ వర్గం భావిస్తుంది. చిన్నమ్మ గ్రూప్ లో ఉన్న ఎమ్మెల్యేల మద్దతు కూడా తమకే ఉందంటున్నారు. ధర్మం తప్పక గెలుస్తుందని ధీమాగా ఉన్నారు. అలాగే శశికళ వర్గం కూడా పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. గవర్నర్ కు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను గవర్నర్ కు అందజేశామని, శశికళను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నట్లు సంతకాలు చేసిన పేపర్ ను కూడా గవర్నర్ కు ఇచ్చారని, ఈ కారణాలతో చిన్నమ్మ చేత గవర్నర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. అయితే గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ మరికాసేపట్లో వీడనుంది.