కర్ణాటకలో రేపు జరగనున్న బలపరీక్షలో ఖచ్చితంగా నెగ్గుతామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. అనుకున్న దాని కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యే మద్దతు తమకు లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆశ్చర్యపోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ గెలుపు ఆరున్నర కోట్ల కన్నడ ప్రజలకు అంకితం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ శ్రేణులు రేపు సాయంత్రం సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా యడ్డీ పిలపునివ్వడం విశేషం. కాంగ్రెస్, జేడీఎస్ అపవిత్ర కలయికతో విశ్వాస పరీక్షకు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాగా, యడ్యూరప్ప ఇంత ధీమా వ్యక్తం చేయడంతో కాంగ్రెస్, జేడీఎస్ లో ఆందోళన కనపడుతోంది.