బీజేపీకి భారీ షాక్...!

Update: 2018-05-17 07:37 GMT

పశ్చిమ బెంగాల్ లో జరిగిన పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తున్నాయి. గురువారం జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఫలితాలు పూర్తిగా తృణమూల్ కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తున్నాయి. గతంలో సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించి, మంచి పట్టున్న సీపీఎం, పశ్చిమ బెంగాల్లోనూ విస్తరించాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీలకు ఎన్నికల ఫలితాల్లో భారీ ఎదురుదెబ్బ తగులుతోంది. కాంగ్రెస్ కూడా ఎక్కడా చెప్పుకోదగ్గ స్థానాలు గెలవడం లేదు. దీంతో బెంగాల్ లో తనకు తిరుగులేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి రుజువు చేసుకుంటోంది.

ఇప్పటికే ఎకగ్రీవమైన వేల పంచాయితీలు...

ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో పెద్దపంఖ్యలో పెంచాయితీలు కనీసం పోటీ లేకుండా తృణమూల్ కాంగ్రెస్ ఏకగ్రీవంగా గెలుచుకుంది. రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయితీల్లోని 48,650 స్థానాల్లో 16,814 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పంచాయితీ సమితీల్లోని 9,217 స్థానాల్లో 3,017 స్థానాలు, జిల్లా పరిషత్ లోని 825 స్థానాల్లో 203 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. కాగా, ఎన్నికల నిర్వహణలో తృణమూల్ కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు పాల్పడిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలింగ్ రోజు కూడా రాష్ట్రంలో తీవ్ర హింస చెలరేగి పలువురు సీపీఎం, బీజేపీలకు చెందిన కార్యకర్తలు మరణించిన విషయం తెలిసిందే.

భారీ ఆధిక్యంలో టీఎంసీ...రెండో స్థానంలో బీజేపీ....

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం 223 జిల్లా పరిషత్ ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఏకపక్షంగా మొత్తం 223 స్థానాలను గెలుచుకుంది. 882 గ్రామ పంచాయితీల్లో తృణమూల్ కాంగ్రెస్ 768 స్థానాలను, బీజేపీ 69 స్థానాలను, వామపక్షాలు 7 , కాంగ్రెస్ 8, ఇతరులు 30 స్థానాలు కైవసం చెసుకున్నాయి. 111 పంచాయితీ సమితీల్లో తృణమూల్ అన్ని స్థానాలను గెలుచుకుంది. మిగతా స్థానాల లెక్కింపు జరుగుతోంది.

Similar News