ప్రభోదానంద గుట్టు విప్పిన జేసీ

Update: 2018-09-19 08:09 GMT

బ్రహ్మా, విష్ణు, ఈశ్వరులను దూషించిన ప్రభోదానంద స్వామి అలా అవుతాడని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభోదానందపై బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... గ్రామస్థులు వినాయక విగ్రహాలను నిమజ్జనం కోసం తీసుకెళ్తుండగా ప్రభోదానంద స్వామి అనుచరులు దాడులు చేశారని, వినాయక విగ్రహాలు సహా ట్రాక్టర్లను దహనం చేశారని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న తనపై ప్రభోదానంద మనుషులు రాళ్ల దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని విమర్శించారు. రాళ్లు వేస్తుంటే తమకంటే ముందు పోలీసులే పారిపోయారని, నా పక్కన కూర్చున్న వ్యక్తికి రాయి తగిలితే గన్ మెన్లు కనీసం గాలిలోకి కూడా కాల్పులు జరపలేదని, ఇక పోలీసులు ఉండి ఎందుకని ప్రశ్నించారు.

ఆశ్రమంలో ఆయుధాలు దొరికాయి...

ప్రెండ్లీ పోలీసింగ్ అంటే జేబు దొంగను పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి కాఫీ తాగించి బతిమిలాడటమే అని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు పోలీసులను చూస్తేనే బయపడే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రభోదానంద కూడా డేరా బాబా లాంటివాడే అని, పోలీసులు ఆశ్రమంలో గాలించగా ఆయుధాలు, మద్యం బాటిళ్లు, నకిలీ ఆధార్ కార్డులు దొరికాయన్నారు. ప్రభోదానంద మూడు హత్యలు చేశాడని ఆరోపించారు. ప్రభోదానందపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలపారు. గతంలో ప్రభోదానంద అక్రమాలపై సాక్షి ఛానల్ లో కథనాలు ప్రసారం చేశారని, కానీ ఇప్పుడు జగన్ మాట్లాడటం లేదని విమర్శించారు.

Similar News