ఎందుకు ఓడామో చెప్పిన మోదీ

సుదీర్ఘ పాలనవల్లే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయామని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. ఎఎన్ఐ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ పలు విషయాలను ప్రస్తావించారు. [more]

Update: 2019-01-01 13:14 GMT

సుదీర్ఘ పాలనవల్లే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయామని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. ఎఎన్ఐ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ పలు విషయాలను ప్రస్తావించారు. మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదని, తాము అక్కడ అధికారంలోకి వస్తామని కూడా చెప్పలేదన్నారు. బీజేపీపై వ్యతిరేకత ఉందంటున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రాజకీయంగా తనకు ఏమైనా పరవాలేదు కాని సైనికుల క్షేమం కోసమే తాను పనిచేశానని చెప్పుకొచ్చాచరు. మోదీ మ్యాజిక్ అనేది ఏమీ ఉండదని, ప్రజల విశ్వాసమే ఉంటుందని తెలిపారు. ఈ నాలుగున్నరేళ్లలో ప్రజల విశ్వాసాన్ని పొందగలిగామన్నారు. దేశమంతా నిరంతర విద్యుత్తును అందించగలిగామని చెప్పారు.

తప్పు చేయలేదు…..

పెద్దనోట్ల రద్దుతో బీజేపీ ప్రభుత్వం తప్పు చేయలేదన్నారు. నల్లధనాన్ని తరిమికొట్టేందుకే పెద్ద నోట్లను రద్దు చేశామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకే పెద్దనోట్లను రద్దు చేశామని, హడావిడిగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. దాని ఫలాలు ఇప్పడిప్పుడే కన్పిస్తున్నాయన్నారు. అవినీతి లేనందునే దొంగలు దేశాన్ని వదిలి పోతున్నారన్నారు. తమకు ఎవరిపై వ్యక్తిగత కక్షలు లేవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఏ రంగాన్ని తీసుకున్నా దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. దేశంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందన్నారు. బీజేపీ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుందని చెప్పారు.

అనేక సంస్కరణలతో…

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అవినీతి మచ్చుకైనా బీజేపీలో కన్పించిందా? అని మోదీ ప్రశ్నించారు. దేశాన్ని వదిలి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను వెనక్కు రప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. జీఎస్టీ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవని అన్నారు. గతంలో ఉన్న పన్నుల విధానాన్ని సరళీకృతం చేశామన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సీఎంలు అందరూ సభ్యులేనని, కాంగ్రెస్ వారి సీఎంలనే తప్పుపడుతుందా? అని ప్రశ్నించారు. వినియోగదారులకు రక్షణ కల్పించడం కోసమే జీఎస్టీని అమలు చేశామని తెలిపారు. అన్ని పార్టీల అంగీకారంతోనే జీఎస్టీని అమలు చేశామన్నారు. చిరువ్యాపారులకు కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని, ఏ సంస్కరణ తెచ్చినా కొందరికి ఇబ్బందులు తప్పవన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని తాను అనలేదని, కాంగ్రెస్ సంస్కృతి ముక్త్ భారత్ అని మాత్రమే తాను అన్నానని, ఇప్పటికీ అదే మాట మీద ఉంటానని చెప్పారు. తనపై విమర్శలు చేస్తున్న వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మహాకూటమికి, ప్రజలకు మధ్యనే పోటీ ఉంటందని, బీజేపీ ప్రజల పక్షాన ఉంటుందన్నారు. 2019 ఎన్నికల్లో తిరిగి బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు.

రైతు రుణమాఫీపై….

రైతు రుణ మాఫీ అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందన్నారు. గత కొన్నేళ్ల నుండి పాలకులు రుణమాఫీ చేస్తూనే ఉన్నా రైతుల జీవితాలు బాగుపడ్డాయా? అని ప్రశ్నించారు. రైతు నష్టపోకుండా మూలాలు సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కిసాన్ యోజన ద్వారా అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నామన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలను తీసుకొచ్చామన్నారు. రైతు ఉత్పత్తులకు సరైన ధర కల్పించి, సాగు సమస్యలను తొలగిస్తే రైతు రుణమాఫీ అవసరం లేదని మోదీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ స్వామినాధన్ కమిషన్ ను పక్కన పెట్టి రైతాంగం పట్ల మొసలి కన్నీరు కారుస్తుందన్నారు. రుణమాఫీ వల్ల ఎంతమంది ప్రయోజనం పొందుతారన్నారు. రైతు రుణమాఫీ ఎన్నికల స్టంట్ గా మోదీ అభివర్ణించారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రైతురుణ మాఫీ చేస్తే తాము అడ్డు చెప్పలేదన్నారు. కానీ తాము రైతు ప్రయోజనల కోసం కట్టుబడి ఉన్నామన్నారు.

Tags:    

Similar News