రష్యా తీరుపై కేఏ పాల్ ఆగ్రహం.. యుద్ధాన్ని ఆపేందుకు నిరాహార దీక్ష

తాజాగా ఉక్రెయిన్, రష్యా సంక్షోభంపై ప్రపంచ శాంతి దూత కె.ఎ.పాల్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యవహార శైలిపై ..

Update: 2022-02-26 11:58 GMT

అమెరికా : ఉక్రెయిన్ పై రష్యా వరుసగా మూడోరోజు యుద్ధం కొనసాగిస్తోంది. బాంబుల మోతకు ఉక్రెయిన్ భూ భాగం దద్దరిల్లుతోంది. ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లు, బంకర్లలో తలదాచుకుంటున్నారు. కాగా.. ఉక్రెయిన్ పై రష్యా ఈ స్థాయిలో విరుచుకుపడటంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపి, శాంతి చర్చలకు సిద్ధం కావాలని రష్యాకు సూచిస్తున్నా.. రష్యా మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

తాజాగా ఉక్రెయిన్, రష్యా సంక్షోభంపై ప్రపంచ శాంతి దూత కె.ఎ.పాల్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యవహార శైలిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ మెంటలోడని, యుద్ధాన్ని ఆపాలని చాలా రోజులుగా చెప్తున్నా.. వినకుండా ఇలా చేస్తున్నాడంటూ దూషించారు. ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధ వాతావరణం తలెత్తకుండా ఉండేందుకు తాను 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ లో నెలకొన్ని పరిస్థితులను తలచుకుని ఆయన కంటతడి పెట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉందన్నారు.
అమెరికా సైన్యాన్ని ఉక్రెయిన్ కు పంపాలని తాను కొద్దిరోజుల క్రితమే బైడెన్ కు చెప్పానన్న కేఏ పాల్.. అప్పుడు ఓకే చెప్పిన బైడెన్ ఇప్పుడు వెనక్కి తగ్గారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బైడెన్ కు కూడా కళ్లు నెత్తికెక్కాయంటూ మండిపడ్డారు. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ లో అమాయక ప్రజలు చనిపోతున్నారని, రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధ ఫలితం భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుందని, ఫలితంగా అన్ని ధరలు పెరిగి, సామాన్యుడిపై భారం పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా యుద్ధాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.






Tags:    

Similar News