లగడపాటికి ఇంటి పోరు..!

Update: 2018-12-07 08:00 GMT

ఓ వైపు తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమికే మొగ్గు ఉంటుందని... నానా తిప్పలు పడుతూ చెప్పిన లగడపాటి రాజగోపాల్ కి సొంత వారే షాక్ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కువ జిల్లాల్లో కాంగ్రెస్ కే మొగ్గు ఉందని లగడపాటి తాజాగా తన సర్వే పేరుతో మీడియా ముందుకువచ్చారు. అయితే, ఆయన రెండో భార్య జానకి రాజగోపాల్ మాత్రం ఇందుకు విరుద్ధంగా స్పందించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలవడం ఖాయమని, ఆ పార్టీకి కచ్చితంగా 55 - 70 స్థానాలు వస్తాయని ఆమె అంచనా వేశారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఆమె పోస్ట్ చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక కాంగ్రెస్ కూటమికి 50 సీట్ల లోపే వస్తాయని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు రాకతో విశ్రాంతి దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మేలే జరిగిందని, ఆ పార్టీ చాలా వరకు పుంజుకుందని ఆమె అభిప్రాయపడ్డారు. అదే సమయంలో చంద్రబాబు సభలు, రోడ్ షోల వల్ల తెలంగాణ ప్రజలకు మరోసారి సెంటిమెంట్ అంశం గుర్తుచేసిందన్నారు.

టీఆర్ఎస్ తరపున మొదటి భార్య ప్రచారం

ఇక కాంగ్రెస్ లో పలువురు ప్రముఖ నేతలు ఓడిపోవడం కూడా ఆసక్తి కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు. అయితే, తన భర్త సర్వేపై నమ్మకం ఉందని ఆమె పేర్కొనడం గమనార్హం. ఇక మిగతా నాలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... మిజోరం, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని, రాజస్థాన్ లో కాంగ్రెస్ గెలవనుందని ఆమె అంచనా వేశారు. ఇక, ఇటీవల రాజగోపాల్ మొదటి భార్య పద్మ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ విజయం కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

Similar News