పవన్ పై జగన్ సెన్సేషనల్ కామెంట్స్

Update: 2018-07-24 14:26 GMT

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విలువల గురించి పవన్ మాట్లాడుతున్నారని, అసలు ఆయనకు విలువలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం విలువలా అని ప్రశ్నించారు. నాలుగేళ్లకు, ఐదేళ్లకు ఒకసారి కొత్త కార్లు మార్చినట్లుగా పెళ్లాలను మారుస్తున్నారని, వేరేవారయియితే, నిత్య పెళ్లి కొడుకు అని జైల్లో వేసే వారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడినా మనం వినవలసిరావడం, వాటి గురించి మళ్లీ విశ్లేషించుకోవడం మన ఖర్మ అన్నారు.

నాలుగేళ్లుగా ఆయనను చూసింది అంతే...

నాలుగేళ్లుగా మోదీ, చంద్రబాబుతో కలిసి సంసారం చేసి ఎన్నికలకు ఆరునెలల ముందు బయటకువచ్చి నేను పతివ్రతను అంటున్నారని ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ముగ్గురు కలిసి పొడిచి ఇప్పుడు బయటకు వచ్చి ఒకరేమో... నేను తప్పు చేశానని, క్షమించాలని చెబుతున్నారని, మరో వ్యక్తేమో...నా తప్పు లేదని, మిగతా ఇద్దరూ నన్ను మోసం చేశారని చెబుతున్నారని, మొదటి ఇద్దరి ఆమోదం తెలిపిన తర్వాతే తాను పొడిచానని మూడో వ్యక్తి చెబుతున్నారని విమర్శించారు. నాలుగేళ్లుగా పవన్ కళ్యాణ్ ను చూస్తుంది ఆరునెలలకో, సంవత్సరానికో ఒకసారి మాత్రమే అన్నారు. అదీ ట్విట్టర్ లోనో, ఇంటర్వూలోనో కనిపిస్తాడని, అది కూడా చంద్రబాబు కు ఎక్కడ అవసరం పడితే అక్కడ, ఆయనను కాపాడటానికే మాత్రమే బయటకు వస్తాడని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల గురించి మాట్లాడటం బాధాకరమన్నారు.

Similar News