ఆర్మీలో పనిచేస్తూ..కాలాంతకుడిగా మారాడే?

Update: 2018-05-09 02:38 GMT

దేశ రక్షణ వ్యవస్థలో కీలక అధికారిగా పనిచేస్తున్నాడు.. కానీ అతడి ఒంకర బుద్ధి అక్రమాలవైపు మళ్లింది. ఆర్మీలోనే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వలవేశాడు.. లక్షలు వసూలు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అతనితో పాటు మరో ఆరుగుర్ని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ గోల్కొండ ఆర్మీ ఆధీనంలో ఉన్న ఆర్టిలరీ గ్యాలరీలో లాన్స్ నాయక్ గా పనిచేస్తున్నాడు రామాంజనేయులు. ఇతనికి హాశం అనే అతడి స్నేహితుడు తోడయ్యాడు. ఈజీ మనీ కోసం ప్లాన్ వేశారు. ఆర్మీ, ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అత్తాపూర్ లో ఓ కార్యాలయం తెరిచారు. అందులో మరో ఇద్దర్ని నియమించి.. ఖాకీ డ్రస్సులు వేయించి నిరుద్యోగులను నమ్మించారు.

రెండు లక్షల వసూలు....

వాళ్ల నుంచి అప్లికేషన్లు తీసుకోవడం, ఒక్కో అభ్యర్థి నుంచి రెండు లక్షల నగదు తీసుకున్నారు. ఇలా ముప్పైమంది నిరుద్యోగులు ఈ గ్యాంగ్ కు ఆకర్శితులయ్యారు. ల్యాప్ ట్యాప్ లు, రబ్బర్ స్టాంపులు, ఆఫర్ లెటర్లు, కూడా రెడీ చేశారు. నిరుద్యోగులను నమ్మకం కలిగించేందుకు ఆఫర్ లెటర్లు రిజిస్టర్ పోస్టు ద్వారా వాళ్లకు పంపించింది రామాంజనేయులు గ్యాంగ్. ఆఫర్ లెటర్లపై ఆర్మీ ఎమ్లం, ఒరిజినల్ సంతకాల్లా తలపించాయి. ఈ ముఠా ఇంతటితో ఆగలేదు. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన డబ్బులో 24 లక్షలు ఫేక్ కరెన్సీ గ్యాంగ్ కు చెల్లించారు. ఒక కోటి నకిలీ కరెన్సీ అప్పగించేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ఆ ఆఫర్ లెటర్లు నకిలీవని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు బండారం బైటపడింది. రామాంజనేయులుకు సహకరించిన ముగ్గురు నిందితులతో పాటు.. మహారాష్ట్ర కు చెందిన ఫేక్ కరెన్సీ గ్యాంగ్ ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. అయితే ఇందులో ఆర్మీ కి సంబంధించిన ఇతర అధికారుల ప్రమేయమేమీ లేదని చెబుతున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్..ఇలా కార్యాలయాలు తెరిచి లక్షలు వసూలు చేసే ముఠాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానం వచ్చిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలంటున్నారు పోలీస్ అధికారులు.

Similar News