మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ గౌరవంగా దక్కాలని, అంతేగాని పార్లమెంటులో నినాదాలు పేపర్లు చించడం వంటి గొడవలతో కాదని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ ఎవరో ఇస్తే వచ్చినట్టు ఉండకూడదని, అది జాతి నిర్మాణంలో భాగంగా మహిళలకు దక్కాలని సుమిత్రా అభిప్రాయపడ్డారు. జాతీయ మహిళా పార్లమెంటు ముగింపు సదస్సులో సుమిత్రా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్పై అందరం కట్టుబడి ఉన్నామన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ బిల్లు సత్వరమే లోక్సభ ఆమోదం పొందాలంటే అన్ని రాజకీయ పక్షాలూ మద్దతు ఇవ్వాలని, ఈ దిశగా ముమ్మర ప్రయత్నాలు సాగాలన్నారు. ఒక మహిళా ప్రతినిధిగా ఇందుకు తన వంతు తోడ్పాటును అందిస్తానని చెప్పారు. మహిళా సాధికారిత అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారత కోసం రిజర్వేషన్ కూడా అవసరమని సుమిత్ర చెప్పారు. రిజర్వేషన్కోసం మహిళలు పోరాడితే అది పురుషులకు వ్యతిరేకంగా చేసినట్టు కాదన్నారు. నిర్ణయాలు తీసుకునే అధికార ప్రక్రియలో మహిళా భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. మహిళలకు సొంత పంథా ఉండాలని పిలుపునిచ్చారు. ‘మహిళలకు సాధికారత అంటే దేశ అభివృద్ధికి దోహదపడటమే. జాతి నిర్మాణానికి మహిళలు సాధికారమవ్వాలి’ అని మహాజన్ స్పష్టం చేశారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు పార్లమెంటులో కొన్ని చర్యలు చేపట్టామని, స్పీకర్స్ రిసెర్చి ఇనిషియేటివ్ ప్రారంభిస్తే మహిళా ఎంపీలు బాగా ఆసక్తి చూపించారన్నారు.
మహిళలే సమాజాన్ని నడిపించాలి...
సమాజంలో 50 శాతం ఉన్న మహిళలు ఆ సగానికి పరిమితం కారాదని, 100 శాతానికి నాయకత్వం వహించే దిశగా పయనించాలని సుమిత్ర పిలుపునిచ్చారు. మహిళలు డ్రైవింగ్ సీట్లో ఉండి సమాజాన్ని నడిపించాలని ఆకాంక్షించారు. కృష్ణుడు రథసారథిగా ఉండి రఽథాన్ని సరైన మార్గంలో నడిపాడని, మహిళలూ అలాగే మంచి సారథులైతే.. కుటుంబాలే కాకుండా సమాజమే సరైన దారిలో ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థలలో మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నచోట అభివృద్ధి మెరుగ్గా ఉన్నట్టు తేలిందని చెప్పారు. ‘టెక్నాలజీ అభివృద్ధితో ప్రపంచమే ఓ గ్రామంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో దేశాల మధ్య పరస్పర అవగాహన, సహకారం, సహనం నాయకత్వాలకు అవసరమైంది. మహిళలలో అంతర్లీనంగా ఉండే ప్రేమ, అంకితభావం, సహనం లాంటి గుణాలు ముఖ్యమైన భూమికను పోషిస్తాయి. వాటిని వాటిని అలవరుచుకుంటే మీరు కూడా లోక్సభను నిర్వహించొచ్చు’ అని చమత్కరించారు. ఏ దేశానికైనా నదులు జీవాన్నిస్తాయన్న సుమిత్ర... ‘మహిళలు కూడా నదిలానే జన్మనిస్తారు. నదికి ఏదైనా అడ్డు వస్తే కొద్దిగా ఆగి మళ్లీ ప్రవహిస్తూనే ఉంటుంది’ అన్నారు. మహిళా సాధికారతతో యావత సమాజం పురోగమిస్తుందన్న విషయాన్ని అన్ని పార్టీలు గుర్తించాలని పిలుపునిచ్చారు.