పన్నీర్ బయటపెట్టిన పచ్చి నిజాలు

Update: 2017-03-03 16:30 GMT

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరో బాంబు పేల్చారు. జయలలిత మృతికి శశికళే కారణమంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. తాజాగా మరికొన్ని అంశాలను ఆయన బయటకు తెచ్చారు. జయలలితకు చికిత్స అందించిన వైద్యులు కొందరు పన్నీర్ సెల్వానికి ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారట. వాటిని పన్నీర్ సెల్వం మీడియా ముందుంచారు.

విదేశాలకు తీసుకెళ్లకుండా అడ్డుకున్న చిన్నమ్మ....

జయలలితకు సీరియస్ గా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు అభిప్రాయపడి ఆమెను విదేశాలకు వైద్యం కోసం తరలించాలని అనుకున్నారట. అయితే శశికళ మాత్రం వాటిని పడనీయలేదట. విదేశాలకు జయలలితను చికిత్స కోసం తరలించవద్దంటూ వైద్యులకు ఆమె అడ్డు చెప్పారని పన్నీర్ సెల్వం చెప్పారు. అమ్మను విదేశాలకు తీసుకెళ్లడానికి శశికళ ఎందుకు అనుమతివ్వలేదని ఆయన ప్రశ్నించారు. జయలలిత మృతికి శశికళే కారణమని ఆయన పునరుద్ఘాటించారు. అమ్మ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ పన్నీర్ సెల్వం ఈ నెల 8వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నారు. తాను శశికళకు దూరమైన తర్వాతనే అపోలో వైద్యులు ధైర్యం చేసి తనకు అసలు విషయాలను చెప్పారని పన్నీర్ అంటున్నారు. విదేశాలకు తీసుకెళితే అమ్మ బతికేదని పన్నీర్ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద జయలలిత మృతి పై రోజుకో అనుమానం బయటకు వస్తూనే ఉంది.

Similar News