నేడు రాజ్ భవన్ లో ఉమ్మడి సమస్యలపై చర్చ

Update: 2017-01-31 23:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సమస్యలను పరిష్కరానికి బుధవారం రాజ్ భవన్ వేదిక కానుంది. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు, రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులను ఒప్పించేందుకు గవర్నర్ ఇప్పటికే అంతా సిద్దం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంలో తాను విఫలమయ్యాయన్న చెడ్డపేరు రాకుండా ఉండేందుకు గవర్నర్ నరసింహన్ స్వయంగా రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ రెండు రాష్ట్రాల మంత్రులతో సమావేశం కానున్నారు.

ఎన్నో సమస్యలు....

రెండు రాష్ట్రాలు విడిపోయి మూడేళ్లు గడుస్తున్నా అనేక కీలక సమస్యలకు నేటికీ పరిష్కారం లభించలేదు. కేంద్రం వద్దకు వెళ్లినా రెండు రాష్ట్రాల నుంచి విభిన్న వాదనలు విన్పిస్తుండటంతో ఎటూ తేలలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశం మేరకే గవర్నర్ రంగంలో దిగారు. ప్రధానంగా కృష్ణా జలాలు, సచివాలయాల భవనాల అప్పగింతపై బుధవారం చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ నివాస గృహాల కేటాయింపు, వినియోగానికి సంబంధించి చర్చించనున్నారు. ఇప్పటికే ఏపీతో సంప్రదింపుల కోసం కేసీఆర్ త్రిసభ్య కమిటీని కూడా నియమించారు. దీనిపైనే సోమవారం కేసీఆర్ గవర్నర్ ను కలిసి తన అభిప్రాయాలను కూడా వెల్లడించారు. ఇక సమస్యలపై నాన్చుడు ధోరణిని విడనాడాలని ఆయన కూడా భావిస్తున్నట్లు సమాచారం. గవర్నర్ సమావేశంలో ఏపీ నుంచి మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, తెలంగాణ నుంచి మంత్రులు హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేకానంద ఉంటారు. ఉద్యోగుల కేటాయింపు, హైకోర్టు విభజన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశముందంటున్నారు. ఏపీ భవన్ పంపకాలపైన కూడా చర్చ జరుగుతుంది. వీటన్నింటిపై గవర్నర్ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశముందంటున్నారు.

Similar News