ఊహలు... గుసగుసలాడితే.. సరిపోదు బాబూ....?

Update: 2017-02-15 08:42 GMT

క్షణం తీరిక లేకుండా విదేశీ పర్యటనలు చేసే చంద్రబాబు ఆహ్వానం వచ్చినా కూడా లండన్ పర్యటన రద్దు చేసుకున్నారు. ఏ దేశం వెళితే ఆ దేశంలా, ప్రపంచస్థాయిలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బ్రిటన్ ప్రభుత్వం పెద్ద ఝలక్ ఇచ్చింది. దీంతో షాక్ తిన్న బాబు ఏకంగా తన లండన్ పర్యటననే రద్దు చేసుకున్నారు. అమరావతిపై వాస్తవంగా ఏం చేశారో చెప్పమని నిలదీయడంతో నీళ్లు నమిలిన బాబు బ్రిటన్ పర్యటనకు మంత్రి నారాయణను పంపి తాను బీజీగా ఉన్నట్లు బ్రిటన్ ప్రభుత్వానికి సమాచారం పంపారు.

బాబు లండన్ పర్యటన రద్దు....

విశ్వసనీయ సమాచారం మేరకు..బ్రిటన్‌ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ విభాగం ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు లండన్‌లో ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ వాటర్‌ టెక్నాలజీపై ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పురోగతి, మార్కెటింగ్‌ అవకాశాలపై విస్తృత చర్చలు జరపడం ఈ సదస్సు ముఖ్యోద్దేశం. ఇందులో పాల్గొనేందుకు మరికొందరితో పాటు ఏపీ సర్కారుకూ ఆహ్వానం అందింది. అయితే సదస్సులో చెప్పాలనుకునే విషయాన్ని ముందుగా తమకు తెలియజేయాలని ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ విభాగం కోరింది. ఏ దేశం వెళితే ఆ దేశంలా, ప్రపంచస్థాయిలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పే చంద్రబాబు ఈసారి కూడా.., భవిష్యత్తులో ఎంత అద్భుతంగా రాజధానిని తీర్చిదిద్దబోయేదీ సవివరంగా తెలియజేసేలా ఓ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బాబు డైరెక్షన్‌ మేరకు అధికారులు ప్రజెంటేషన్‌ను తయారు చేశారు.

సాధించిన పురోగతి ఏంటో చెప్పాలన్న బ్రిటన్...

చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని నిర్మాణానికి రైతులంతా భూములిచ్చారని, ఆయన తన సమ్మోహనా శక్తితో లక్షల కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని, ఇంటర్నేషనల్‌ స్కూళ్ళు, కాలేజీలు తరలి వస్తున్నాయని, పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, రాజధాని పరిధిలో భవిష్యత్‌లో 3 లక్షల ప్రత్యక్ష, 5.5 లక్షల పరోక్ష ఉద్యోగాలు రాబోతున్నాయంటూ గ్రాఫ్‌లతో సహా అద్భుత ఊహా చిత్రానికి రూపకల్పన చేసి సీడీ రూపంలో బ్రిటన్‌కు పంపారు. అయితే ప్రభుత్వం పంపిన నివేదికపై బ్రిటన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఊహాగానాలు కాకుండా ఇప్పటివరకు సాధించిన పురోగతి చెబితే బాగుంటుందని తెలిపింది. సదస్సులో వాస్తవాలను ప్రస్తావించాలని సూచించినట్టు తెలిసింది. లండన్‌ వేదికగా మరోసారి అంతర్జాతీయ సమాజానికి లెక్చర్‌ ఇవ్వాలనుకున్న చంద్రబాబు ఊహించని ఈ పరిణామంతో తన పర్యటన రద్దు చేసుకున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. లండన్‌లో జరిగే ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ సదస్సుకు వాస్తవంగా ముఖ్యమంత్రి వెళ్ళాల్సి ఉందని, కానీ ఆయన దైనందిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఆయన ప్రతినిధిగా మంత్రి నారాయణ వెళ్తున్నారని సీఆర్‌డీఏ మీడియా సలహాదారు ఎ. చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ విషయమై సీఆర్‌డీఏ అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారని, సదస్సులో ఏయే అంశాలను ప్రస్తా వించాలో వివరించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Similar News