అవును! వైద్యురాలిగా ఆమెసక్సెస్ అయ్యారు. హైదరాబాద్లో పెద్ద పేరు కూడా తెచ్చుకున్నారు. రోగుల నాడిని పట్టుకోవ డంలో ఆమె అనేక విజయాలను ఆమె తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఏకంగా ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టారు. మరి ఇప్పుడు ప్రజల నాడిని పట్టుకుంటారా? విజయం సాధిస్తారా ? టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గంలో ఆమె ఎలా పోటీ ఇస్తారు ? అనే విషయాలు తెరమీదికి వస్తున్నాయి. ఇంతకీ ఎవరా డాక్టర్? ఏంటా కథ? అనే విషయాలను పరిశీలిస్తే.. ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. డాక్టర్ శ్రీదేవి. ప్రముఖ వైద్యురాలు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. హైదరా బాద్లో సెటిల్ అయ్యారు. అయితే, సొంత ఊరు మాత్రం.. గుంటూరు జిల్లా.. తాడికొండ నియోజకవర్గం.
నిన్న మొన్నటి దాకా..?
నిన్న మొన్నటి వరకు డాక్టర్ శ్రీదేవి ఎవరో పెద్దగా ఏపీ ప్రజలకు తెలియరు. ఎంతో మంది వైద్యుల్లో ఆమె ఒకరు. కానీ, అకస్మాత్తుగా వైసీపీ అధినేత జగన్ తీసుకున్న కీలక నిర్ణయంతో ఆమె పేరు ప్రముఖంగా రాజకీయ తెరమీదికి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆమె తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. నిజానికి తాడికొండ నియోజక వర్గంలో వైసీపీ తరఫున ఇప్పటికే.. క్రిస్టియానా కతేరా ఇంచార్జ్గా ఉన్నారు. గత ఎన్నికల్లో ఈమె వైసీపీ తరఫున పోటీ చేశారు. ఇదే ఎన్నికల్లో టీడీపీ తరఫున శ్రావణ్ కుమార్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో క్రిస్టియానా కతేరా గట్టి పోటీనే ఇచ్చారు. కేవలం 7 వేల ఓట్ల తేడాతోనే శ్రావణ్ కుమార్ విజయం సాధించారు.
టడీపీ స్ట్రాంగ్ గా....
నాలుగుళ్లలో చూస్తే ఏపీ రాజధాని అమరావతికి గుండెకాయ లాంటి ప్రాంతమంతా ఈ నియోజకవర్గంలోనే ఉండడంతో పాటు ఇక్కడ తిరుగులేని అభివృద్ధి జరగడంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ గత నాలుగేళ్లలో మరింత స్ట్రాంగ్ అయ్యింది. అయితే, ఇక్కడ మరింత బలోపేతం కావాలని భావించారో ఏమో.. జగన్ కతేరాను పక్కన పెట్టి డాక్టర్ శ్రీదేవిని రంగంలోకి దింపారు. ఈమె వచ్చే ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించి గెలుస్తుందనే అంచనాలు వేసుకున్నారు. అయితే.. స్థానికంగా కతేరా ఈ నాలుగేళ్లలో మంచి పట్టు సాధించారు. ఆమె ఉన్నంతలో ఉన్నంత బాగానే ఖర్చు చేశారు. కానీ, ఆమెను తప్పిం చడంపై స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. దీంతో డాక్టర్ శ్రీదేవికి ఇక్కడ నాడి లభిస్తుందా? అన్నది ప్రధాన ప్రశ్నగా మారిపోయింది.
అందరిని తనవైపుకు తిప్పుకుంటేనే?
ప్రస్తుతం కతేరాతో అనుబంధం పెంచుకున్న నాయకులు డాక్టర్ శ్రీదేవితో కలిసి పనిచేసేందుకు ముందుకు రాని పరిస్థితి ఉంది. ఆర్థికకోణం నేపథ్యంలోనే జగన్ ఇక్కడ శ్రీదేవిని పోటీలోకి దింపినట్టు తెలుస్తోంది. ఇక నియోజకవర్గంలో కొంతమంది నాయకులు అప్పుడే శ్రీదేవి తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన శ్రీదేవి ముందుగా అసమ్మతి వాదులను తన అనుచరులుగా మార్చుకోవడంపై దృష్టి పెట్టాలి. ఆతర్వాత ఇప్పటి వరకు కతేరాతో అనుంబంధం పెంచుకున్న ప్రజలను సైతం తనవైపు మళ్లించుకునే ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో శ్రీదేవి చాలా మెట్లు కిందికి దిగిరావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్గా ఉన్న టీడీపీని ఢీకొట్టేందుకు చాలా కసరత్తులే చేయాల్సి ఉంది. మరి ఈ లేడీ డాక్టర్ రాజకీయం ఎలా ఉంటుందో ? వెయిట్ అండ్ సీ..!