అనుభవమా? యువనాయకత్వమా...?

Update: 2018-12-09 17:30 GMT

రాజస్థాన్ ఖచ్చితంగా తమ చేతికి దక్కుతుందన్న ఆత్మవిశ్వాసంలో హస్తం పార్టీ ఉంది. లెక్కలు, సర్వేలు కూడా దాదాపుగా అదే చెబుతున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ కూడా రాజస్థాన్ ను దాదాపుగా వదిలేసుకున్నట్లే కన్పిస్తుంది. రాజస్థాన్ లో ఓటమి పాలయినా అది ముఖ్యమంత్రి వసుంధరరాజే వల్లనేనని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఓటమిపాలయినా ప్రతిపక్ష పార్టీగా రాజస్థాన్ లో బలంగా ఉంటాం కాబట్టి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మరోసారి మరొకరి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ ఆలోచనగా కన్పిస్తోంది.

గెలిచే ఛాన్సు ఉండటంతో....

రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో దాదాపు 120 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ప్రతి జాతీయ ఛానల్ తేల్చి చెప్పింది. అంటే గెలుపు అవకాశాలు కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశాలున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. సంప్రదాయం ప్రకారం కూడా ఈ రాష్ట్రం బీజేపీ ఖాతాలో పడదన్నది విశ్లేషకుల అంచనా. అయితే రాజస్థాన్ లో పోలింగ్ ముగిసిన వెంటనే కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీకి మారింది.

ఢిల్లీకి మారిన రాజకీయం....

రాజస్థాన్ కాంగ్రెస్ లో సీఎం అభ్యర్ధి ఎవరన్నది ఇప్పటికీ అధిష్టానం స్పష్టం చేయలేదు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ లు ఇద్దరూ అసెంబ్లీ బరిలో నిలిచారు. ఈ ఇద్దరిలో ఒకరికే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో పోలింగ్ అయిపోయిన వెంటనే సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ లు ఢిల్లీకి చేరుకున్నారు. హైకమాండ్ ను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సచిన్ పైలట్ నేరుగా రాహుల్ ను కలసి తన మనసులో మాట చెప్పినట్లు తెలిసింది.

పెద్దయెత్తున లాబీయింగ్.....

ఇక అశోక్ గెహ్లాట్ కూడా లాబీయింగ్ ముమ్మరం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉండటంతో ఆయన నేరుగా సోనియాను కలసే ఆలోచన చేస్తున్నారు. ఒకవైపు రాహుల్, మరోవైపు సోనియాల కరుణా కటాక్షాల కోసం ఈ ఇద్దరు నేతలు తంటాలు పడుతున్నారు. రాహుల్ మొగ్గు సచిన్ పైలట్ వైపే ఉందంటున్నారు. అయితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనాలంటే అనుభవం ఉన్న అశోక్ గెహ్లాట్ కే రాహుల్, సోనియా ఓటేస్తారని కూడా ఢిల్లీలో ప్రచారం జరుగుతుంది. మరి వీరిద్దరిలో టెన్ జన్ పథ్ ఎవరిని సీఎంగా నిర్ణయిస్తుందో చూడాలి.

Similar News