బయటపడ్డారుగా...ఇక తేలిపోతుందేమో....!!!

Update: 2018-12-17 17:30 GMT

వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిపించండి ప్రధాని అభ్యర్థిని మనం డిసైడ్ చేద్దాం. ఇది దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు చేస్తున్న ఏకైక నినాదం. కాంగ్రెస్ గొడుగు కింద కు చేరి కూటమి కట్టిన పార్టీలకు. కాంగ్రెస్, బిజెపి కూటములు కాకుండా ఫెడరల్ ఫ్రంట్ మాది అని చెప్పే వారిది అదే మాట అదే బాట. ఇది కాంగ్రెస్ పార్టీకి కలవరం కలిగిస్తుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేముందు బిజెపి వ్యతిరేక కూటమిలో వుండాలనుకునేవారికి ఒక స్పష్టత ఇవ్వలిసిన అవసరం వుంది. మరి ఆ స్పష్టత తమ అంతట తాము ఇస్తే కూటమిలో చక్రం తిప్పాలని చూస్తున్న పార్టీలకు రుచించదు. ఈ సమస్య పరిష్కారం చేయాలంటే, పిల్లి మెడ లో గంట కట్టాలి అంటే మరో ప్రాంతీయ పార్టీ చేతే రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలోకి తేవాలి. ఇది కాంగ్రెస్ మార్క్ వ్యూహం. దీనికి వేదిక తమిళనాడు అయితే . రాహుల్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే ప్రాంతీయ పార్టీ డిఎంకె. దేశంలో బిజెపి వ్యతిరేక కూటమి లో ఆమ్ ఆద్మీ ది ఒకదారి అయితే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ మరోదారిలో వెళుతున్నారు. కూటమిలో కీ రోల్ వహిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఏపీలో 25 ఎంపీ సీట్లు సాధిస్తే మనం ప్రధాని ని డిసైడ్ చేద్దాం అంటున్నారు . దీంతో తాము అనుకున్నట్లే స్కెచ్ అమలు చేసేసింది కాంగ్రెస్.

స్టాలిన్ సౌండ్ చేశారు ...

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా డిఎంకె అధినేత స్టాలిన్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. చెన్నై లో కరుణానిధి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సోనియా, రాహుల్ గాంధీ, చంద్రబాబు వంటి వారంతా వేదికపై ఉండగానే స్టాలిన్ ఈ సంచలన ప్రకటన చేయడం గమనార్హం. ఇదే వేదికపై కరుణానిధిని సోనియా, రాహుల్, కీర్తిస్తే నెహ్రు నుంచి ఇందిరగాంధీ వరకు స్టాలిన్ వారిపై ప్రశంసలు కురిపించడం విశేషం. పేరుకి కరుణ విగ్రహ ఆవిష్కారణే అయినా ఇలా ఒకరినొకరు పొగుడుకోవడం ద్వారా వచ్చే ఎన్నికలకు దక్షిణాది నుంచి కూటమి ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లే అయ్యింది.

ఇప్పుడు తేలిపోతుందా...?

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించేవారే ఇప్పుడు హస్తం గొడుగు కిందకు చేరతారు. లేనివారు అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ లకు మద్దత్తు ఇవ్వకుండా తటస్థంగా వుంటూ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటారు. గతంలో దేవెగౌడ, ఐ కె గుజ్రాల్, చంద్రశేఖర్, విపి సింగ్ వంటి వారంతా సంకీర్ణ రాజకీయ ప్రధానులు ఎలా అయ్యారో అదేవిధంగా ఎవరికి వారు తమకు వచ్చిన స్థానాల సంఖ్యను బట్టి కేంద్రంలో చక్రం తిప్పాలని తహతహ లాడుతున్నారు. దాంతో కాంగ్రెస్ ఎత్తుగడతో ఇప్పుడు మమత, అరవింద్ కేజ్రీవాల్, బాబు వంటివారు ఆశలపై నీళ్లు చల్లినట్లే. మరి వచ్చే ఎన్నికల్లో సంకీర్ణ సర్కార్ రావాలి చక్రాలు గిరగిరా తిప్పాలనుకుంటున్న ప్రాంతీయ పార్టీల నేతల నెక్స్ట్ స్టెప్ ఏమిటో చూడాలి

Similar News