పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యంత కీలకమైన నియోజకవర్గం దెందులూరులో టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నా.. సిట్టింగ్ ఎమ్మల్యే వరుసవిజయాలతో దూసుకుపోతున్న వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై మాత్రం తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. నిజానికి ఇక్కడ మొదట్లో చింతమేననికి ఉన్న బలం కూడా బాగా తగ్గిపోయింది. ఎక్కడికక్కడ ఆయన దూకుడుగా వ్యవహరించడం, చేతి వాటంప్రదర్శిస్తుండడంతో ప్రతి ఒక్కరూ ఆయనకు దూరమవుతున్నారు. ఇటు పార్టీ కేడర్లోనూ ఆయనతో కలిసి పనిచేయలేమనే మాట స్పష్టంగా వినిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తాను గెలిచి తీరునానని పైకి బీరాలు పలుకుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని కొంచెం లోతుగా విశ్లేషిస్తే.. మాత్రం చింతమనేనికి చింత పట్టుకోవడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి.
అహంభావమే.....
ఏ నాయకుడు ఎన్నికల్లో గెలవాలన్నా.. కూడా ముందు ఆయన కేరక్టర్ చూస్తారు. ఆ తర్వాతే తమకు పనులు చేస్తాడా ? చేయడా ? అని ప్రజలు అంచనాలు వేసుకుంటారు. తాజా తెలంగాణ ఎన్నికల్లో ఓడిన తుమ్మల నాగేశ్వరరావు సైతం వర్కర్గా పేరున్నా ఆయన కేరెక్టరే ఆయన్నె దెబ్బేసిందన్నది ఓపెన్ సీక్రెట్. ఆయనకు ఉన్న అహంభావమే పాలేరులో ఆయన ఓ అనామకుడి చేతిలో ఓడిపోయేందుకు కారణమైందన్నది వాస్తవం. ఇప్పుడు ఈ రెండు రకాలుగా విశ్లేషించుకుంటే.. చింతమనేనికి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. సామాజిక వర్గాల ఆధారంగా చూసినా.. సాధారణ పరిస్థితులను విశ్లేషించు కున్నా కూడా చింతమనేనికి ఎదురు గాలులు వీస్తున్నాయి. ఆయన సొంత సామాజిక వర్గంలోనూ వ్యతిరేకత ఎదురు అవుతోంది. ప్రభుత్వ అధికారులను బెదిరించడం, సామాన్యుల కష్టాలను సైతం పట్టించుకోకపోవడం ఆయనకు ప్రదాన మైనస్గా మారాయి.
నెగిటివ్ టాక్ మాత్రమే....
గడిచిన నాలుగున్నరేళ్లలో చింతమేననిపై పాజిటివ్ టాక్ కన్నా కూడా నెగిటివ్ టాక్ ఎక్కువగా వస్తోంది. మండల, జిల్లా స్థాయి అధికారులను సైతం ఆయన తూలనాడడం, ఎవరిని పడితే వాళ్లని కొట్టడం తర్వాత అవి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం కావడంతో చింతమనేనికి మైనస్గా మారుతున్నాయి. మహిళా అధికారి వనజాక్షిని ఇసుక కుంభకోణం వ్యవహారంలో తన అనుచరులతో కొట్టించారనే విషయం రాష్ట్ర వ్యాప్తంగాగగ్గోలు పుట్టించింది.ఇక, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి తన సమస్యపై చింతమనేని ఆశ్రయిస్తే.. ఆయనను కూడా కొట్టి తరిమేయడం ఇక్కడ చర్చకు దారితీస్తోంది. కొల్లేరులో బలంగా ఉన్న వడ్డెర సామాజిక వర్గానికి కూడా చింతమేనని దూరమయ్యాడు.
వివాదాస్పద విషయాల్లో.....
ఇక ఇటీవలే తమ సొంత పార్టీకే చెందిన ఒక కులసంఘం నేతను కొట్టి వారికి యాంటీగా మారిపోయారు. బీసీల్లోనూ ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పార్టీకి కీలకంగా మారుతుందని భావిస్తున్న కాపు సామాజిక వర్గానికి కూడా చింతమేనని దూరమయ్యారు. జనసేనాని పవన్ కళ్యాణ్ను తిట్టడం ద్వారా కాపులకు చింతమేనేని దూరమయ్యారు. ఇక, తనకు సంబంధం లేని విషయంపైనా జోక్యం చేసుకుని వివాదానికికారణమయ్యారు చింతమేనని. ఓ బస్సుపై ఏర్పాటు చేసిన ప్రచార పోస్టర్లో చంద్రబాబు చిత్రం చిరిగిపోయి ఉండడంతో ఆ బస్సును నిలిపేసి.. హడావుడి చేశాడు. ఇదేమని ప్రశ్నించిన ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. ఇది కూడా ఆయనకు తీవ్ర వ్యతిరేకతనే తీసుకు వచ్చింది. ఇలా ఎటు చూసినా.. చింతమనేనికి వ్యతిరేకత పెరుగుతోంది. ఇక నియోజకవర్గ టీడీపీలో కొందరు కీలక నేతలు ఆయన అవమానాలు భరించలేక మిన్నకుండిపోతున్నారు. ఇప్పటికిప్పుడు ఆయన్ను ఎదిరించే ధైర్యం చేయకపోయినా ఎన్నికల వేళ ఆయనకు దెబ్బేసేందుకు కాచుకూని కూర్చొని ఉన్నారు. మరి ఈ పరిస్థితిలో ఆయన గెలుపు అంత ఈజీకాదని సొంత పార్టీ నేతలే విశ్లేషించుకుంటున్నారు.