బాబు చెలరేగింది అందుకేనా...?

Update: 2018-12-16 09:30 GMT

తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి ఘన విజయం సాధిస్తుందని ఏపీ సర్కార్ కి ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక చంద్రబాబు కు పెద్ద తలపోటు తెచ్చిపెట్టిందా ..? అవుననే టిడిపి వర్గాలు మదన పడుతున్నాయి అని సమాచారం. ఏపీ నిఘా విభాగం నివేదికలను గుడ్డిగా నమ్మి బాబు దెబ్బయిపోయారన్నది ఆ పార్టీ వర్గాల మనోవేదన. ముమ్మర ప్రచారం చేసి కూటమి విజయం తాలూకు మైలేజ్ తన ఖాతాలో వేసుకోవాలని బాబు ఉత్సాహ పడ్డారని అంటున్నారు. అందుకే ప్రచారం చివరి వారం రోజులు తెలంగాణ లో బాబు దుమ్ములేపేలా రోడ్ షో లతో అదరగొట్టారని ఇదంతా ఇంటలిజెన్స్ ఇచ్చిన నివేదికల వల్లే జరిగిందన్నది పార్టీ వర్గాల భావన.

రెచ్చిపోయి మరీ తిట్టారు ...

అక్కడితో ఆగలేదు. బావ ఒక వైపు బామ్మర్ది కం వియ్యంకుడు బాలకృష్ణ మరోపక్క రెచ్చిపోయి టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. వీరిద్దరిలో కొంత వరకు చంద్రబాబు తగ్గి మాట్లాడినా బాలయ్య బాబు మాత్రం తొడలు కొడుతూ మీసం మెలేస్తూ మరీ ప్రత్యర్థిని రెచ్చగొట్టేశారు. విజయం తమనే వరిస్తుందన్న ధీమాతో చంద్రబాబు అండ్ టీం చెలరేగి ప్రచారం చేసినా ఫలితాలు తెలంగాణ టిడిపి సంగతి ఎలా వున్నా ఏపీ టిడిపి ని మాత్రం నైరాశ్యంలో పడేశాయి. ఈ షాక్ నుంచి ఇప్పట్లో ఆ పార్టీ కోలుకునే లా మాత్రం లేదు.

నిఘాలో దూసుకుపోతున్న టి సర్కార్ టీం ...

ఏపీ లో నిఘా వ్యవస్థ వత్తిడికి గురయి అధికారపార్టీకి అనుకూల నివేదికలు ఇస్తూ పోతు ఉండటం మొదటికే చేటు తెచ్చేలా ఉందంటున్నారు విశ్లేషకులు. అదే తెలంగాణాలో నిఘా విభాగానికి ఇచ్చిన స్వేచ్ఛతో అక్కడి అధికారులు ఉన్నదున్నట్లు గులాబీ బాస్ ఫామ్ హౌస్ కి చేరవేయడంతో కేసీఆర్ పని ఎంతో సులువు అయ్యిందని. చెబుతున్నారు. ఇప్పటికైనా ఏపీ సీఎం నిఘా విభాగం భజన బృందం లా మార్చుకోకుండా స్వేచ్ఛగా వ్యవహరిస్తే భవిష్యత్తు బావుంటుందని పార్టీ వర్గాలే అంతర్గత చర్చల్లో వ్యాఖ్యలు చేస్తూ ఉండటం గమనార్హం.

Similar News