కేసీఆర్ కి ఎక్కడికక్కడ చెక్ పెడతారా ...?

Update: 2018-12-26 08:00 GMT

జాతీయ రాజకీయాల్లో సైకిల్ గాలి తీయడం, గులాబీ ని వికసింప చేయడమే కేసీఆర్ లక్ష్యంగా చేసుకున్నారు. అందుకు సంబంధించి చంద్రబాబు కి సన్నిహితంగా ఉంటారని భావించే వారందరిని ఒకటికి రెండు సార్లు కలిసి తన డ్రీమ్ ఫెడరల్ ఫ్రంట్ కి ప్రాణం పోసే పనిలో పడ్డారు తెలంగాణ చంద్రుడు. తెలంగాణ లో సాధించిన తిరుగులేని విజయంతో ఇప్పుడు కేసీఆర్ కి దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఎన్నికలకు ముందుజజజ తరువాత గులాబీ బాస్ ఇమేజ్ లెక్కేస్తే రెండింతలు పెరిగింది. గతంలో ఆయన ఫెడరల్ ఫ్రంట్ కి చేసిన ప్రయత్నాలు సందర్భంగా లభించిన స్వాగతానికి ప్రస్తుతం విజయ చంద్రుడిగా వెళుతున్న సందర్భంలో దక్కుతున్న ఆదరణకు తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు కేసీఆర్. అయితే ఆయన విన్యాసాలు చూస్తూ ఊరుకునే పనిలో లేదు తెలుగుదేశం. ఎక్కడికక్కడ టి బాస్ కి చెక్ పెట్టి జాతీయ రాజకీయాల్లో టిడిపి దే పైచేయి అనిపించుకునే ఎత్తులు కు పదును పెట్టింది సైకిల్.

ఒడిశా ఎంపిని పట్టుకొచ్చి...

మైండ్ గేమ్ ఆడటంలో టిడిపి ని మించిన మాస్టర్ పాలిటిక్స్ లో ఎవ్వరు ఉండరంటారు. ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ తో కేసీఆర్ భేటీ పై తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. దీంతో ఎదో ఒకటి చేయాలన్న యోచనతో ఎంపి కంభంపాటి రామ్మోహనరావు తో సన్నిహితంగా వుండే ఒడిశా ఎంపి సౌమ్య రంజన్ పట్నాయక్ ఎపి సిఎం తో భేటీ అయ్యేలా టిడిపి బ్యాక్ డోర్ ఆఫీస్ వేగంగా పావులు కదిపింది. ఎపి సైతం ఒడిశా తో సన్నిహితంగానే ఉంటుందన్న సంకేతాలతో పాటు బాబు కూటమికి కూడా నవీన్ బృందం దగ్గరగా ఉందనే సందేశాన్ని జనంలోకి విజయవంతంగా పంపే ప్రయత్నం చేశారు.

మమతబెనర్జీ చర్చల వివరాలు...

జాతీయ రాజకీయాల్లో బాబును డమ్మీని చేసేందుకే తెలంగాణ చంద్రుడు కృషి చేస్తున్నారని దీనికి ఇప్పటినుంచి కౌంటర్లు ఏవో ఒకటి ఇవ్వకపోతే ఎపి ప్రజల్లో బాబు పై సందేహాలు ఏర్పడతాయన్న ఆందోళనే ఈ పరిణామానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే రీతిలో మమతాబెనర్జీ కేసీఆర్ తో సాగిన చర్చల వివరాలను చంద్రబాబు తో షేర్ చేసుకున్నారన్న ప్రచారం టిడిపి తెరపైకి తేవడం గమనిస్తే చంద్రులిద్దరి నడుమ జాతీయ రాజకీయాల్లో పట్టుకోసం సాగుతున్న యుద్ధం తీవ్ర స్థాయిలో ఉందనేది తేలిపోతుంది. ఇది భవిష్యత్తులో మరింత ముదిరి పాకాన పడేలాగే కనిపిస్తుంది. చూడాలి ఏ చంద్రుడు చక్రం తిప్పుతారో...?

Similar News