మెగా, పవర్ స్టార్లతో మల్టీస్టారర్?

Update: 2017-02-02 12:04 GMT

తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇక పండగే పండగ. అందులో మెగా అభిమానులు మజా చేసుకునే వార్త ఇది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి మల్టీ స్టారర్ మూవీ మన ముందుకు రాబోతోంది. ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి, అశ్వనీదత్ ల నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కల్యాణ్ లు చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు టాలివుడ్ టాక్.

ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే లీక్.....

ఖైదీ నెంబరు 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సుబ్బరామిరెడ్డి ఈ ప్రకటన చేశారు. తాను మెగా హీరోలతో సినిమాను తర్వలోనే నిర్మిస్తానని చెప్పారు. అయితే ఆరోజు టిఎస్సార్ మాటలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కాని టీఎస్సార్ తాను చెప్పిందే చేశారు. ఈమేరకు ఇద్దరు మెగా హీరోలు, మెగా ప్రొడ్యూసర్లతో వెండితెరపై కొత్త చిత్రం రానుంది. అయితే ఈ సినిమా కథేంటి? ఎప్పటి నుంచి షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది? హీరోయిన్లు వంటి అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. మొత్తం మీద చిరంజీవి, పవన్ కల్యాణ్ ఒకేచిత్రంలో నటిస్తున్నారన్న వార్తలు రావడంతో మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. టి.సుబ్బరామిరెడ్డి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించడంతో టాలివుడ్ లో హాట్ టాపికయ్యింది.

బిజీ షెడ్యూల్ లో ఇద్దరూ....

తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తరువాత నటించిన చిరంజీవి ఖైదీ నెం.150 తో రికార్డు ల మోత మోగిస్తున్నాడు. మరో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు చిత్రీకరణ లో పాల్గొంటూనే జనసేన పార్టీ వ్యవహారాలు చక్కబెడుతూ బిజీ అయిపోయాడు. అయితే రానున్న ఏడాది కాలంలో కాటమ రాయుడు, ఆర్.టి.నీసం సినిమా, త్రివిక్రమ్-రాధా కృష్ణ సినిమాలతో ప్రేక్షకులని అలరించబోతున్న సంగతి తెలిసిందే. ఖైదీ నెం. 150 విజయోత్సవ సభలో చిరు-పవన్ లతో మల్టీ స్టారర్ తీయటం తన జీవిత లక్ష్యమని ప్రకటించిన ప్రముఖ నిర్మాత, రాజ్య సభ సభ్యులు టి.సుబ్బి రామిరెడ్డి రెండు వారాలు తిరిగే సరికే ఈ ప్రాజెక్ట్ కి పునాదులు వేశారు. తాజాగా ఆయన తీయబోతున్న తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరు-పవన్ ల మల్టీ స్టారర్ అని వెల్లడించేశారు. ఇప్పుడు సుబ్బి రామిరెడ్డి తీయబోతున్న ఈ చిత్రం సినీ పరిశ్రమలో సంచలనమైన చర్చగా మారిపోయింది.

పవన్ కు వీలవుతుందా?

అయితే ఇప్పటికే పలు కమిట్మెంట్స్ లో వున్న పవర్ స్టార్ ఈ ప్రాజెక్ట్ కి ఎప్పటికి తన సహకారం అందజేస్తాడో చూడాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తి చేయవలసిన ప్రాజెక్ట్స్ విడుదల అయ్యే సరికి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలకు రంగం సిద్ధం కావొచ్చు. 2019 ఎన్నికల సమయానికి జనసేన ని ప్రజలలోకి ఉధృతంగా తీసుకెళ్లాలని యోచిస్తున్న పవన్ తన అన్న తో 2019 లోపు కనిపిస్తాడో లేదో చూడాలి మరి.

గతంలో ఎఎన్నార్..ఎన్టీఆర్....

రామారావు-నాగేశ్వర రావు, శోభన బాబు-కృష్ణ ల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులు నటించే మల్టీ స్టారర్ చిత్రాలు విరివిగా వస్తుండేవి. తరాలు మారుతున్న కొద్దీ బడ్జెట్ కారణాల దృష్ట్యా, ఫ్యాన్ బేస్డ్ హీరోయిజం ల చట్రంలో స్టార్ స్టేటస్ చుట్టూ కథలు అల్లుకుని చిత్రాలు నిర్మించటం వలన ఈ సంస్కృతి తెలుగులో కనుమరుగు అయిపోతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి స్ఫూర్తి పొంది వెంకటేష్ తెలుగు చిత్ర పరిశ్రమ లోని అగ్ర కథానాయకులు ఐన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో పాటు కుర్ర హీరో రామ్ తో కూడా కలిసి పలు మల్టీ స్టారర్ ప్రాజెక్ట్స్ చేసాడు. ఇక మనం వంటి ఫామిలీ చిత్రంతో అక్కినేని కుటుంబం లోని నటులంతా తారసపడ్డారు. ఇటువంటి మల్టీ స్టార్ర్స్ అడపా దడపా వస్తున్నప్పటికీ ఇవి ప్రేక్షకుల ఆకలి తీర్చేవి కావు. తెలుగు సినిమా అభిమానులలో ఎప్పటి నుంచో వున్న కోరిక నందమూరి బాల కృష్ణ-తారక్ ల మల్టీ స్టారర్ తో పాటు మెగా స్టార్-పవర్ స్టార్ ల మల్టీ స్టారర్ చిత్రాలను వీక్షించాలని. కాగా వీటిల్లో ఒక కోరిక ఇప్పుడు నిజం కాబోతోంది.

Similar News