చంద్రబాబును హీరోను చేస్తే కోర్టుకు వెళ్తా : లక్ష్మీ పార్వతి

Update: 2017-02-07 16:40 GMT

నందమూరి తారక రామారావు బయోపిక్ కు వివాదం చుట్టుకుంటోంది. తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కధ ఆధారంగా చిత్రాన్ని నిర్మిస్తానని బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఎన్టీఆర్ పాత్రను తానే పోషిస్తానని నటరత్న చెప్పారు. కాని ఇప్పడు విలన్ ఎవరన్నది చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి బాలయ్య బాబు ఎన్టీఆర్ పై సినిమా తీయడం సంతోషమేనని, అయితే అందులో చంద్రబాబును హీరోగా చూపిస్తే కోర్టుకు వెళతానని ఆమె హెచ్చరించారు. ఎన్టీఆర్ జీవితంలో జరిగింది జరిగినట్లు చూపాలని, ఆయన చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని లక్ష్మీపార్వతి తెగేసి చెప్పారు.

ప్రారంభం కాకముందే వివాదం....

అయితే ఎన్టీఆర్ పై సినిమా తీస్తే విలన్ ఎవరు? అన్న ప్రశ్నకు ఇంకెవరు? లక్ష్మీపార్వతేనని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ కామెంట్ చేశారు. దీనిపై లక్ష్మీపార్వతి ఘాటుగా స్పందించారు. తనను విలన్ ను చేసి చూపిస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. ఎన్టీఆర్ భార్యగా తాను బతికే ఉన్నానన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎన్టీఆర్ చేసిన మంచి పనులను సినిమాలో చూపిస్తే తనకు అభ్యంతరం లేదని..బాలయ్య కు ధైర్మముంటే ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని సినిమాలో చూపించాలని లక్ష్మీపార్వతి సవాల్ విసిరారు. తన బావ చంద్రబాబు గొప్పవాడని, పార్టీని నిలబెట్టారని, నన్ను దుష్టశక్తిగా చూపిస్తే క్షమించేది లేదని ఆమె బాలయ్యకు స్పష్టం చేశారు. దీనిపై న్యాయస్థానానికి వెళ్లేందుకు కూడా వెనకాడబోనని చెప్పారు. నిజమైన ఎన్టీఆర్ ను చూపిస్తారా? లేక ఆయనకు వెన్నుపోటు పొడిచిన వారిని గురించి కూడా చూపిస్తారా? తేల్చుకోండి అని లక్ష్మీపార్వతి అన్నారు. మొత్తం మీద ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమా తీస్తానని ప్రకటించిన వెంటనే వివాదాలు చుట్టుముట్టాయి. అయితే బాలయ్య మాత్రం సినిమాను ఎక్కడ ప్రారంభించాలో....ఎక్కడ ముగించాలో...తనకు తెలుసునని చెప్పటం విశేషం.

Similar News