నిర్మాతకు ఫైన్ కడుతున్న దర్శకుడు

Update: 2018-11-24 08:53 GMT

ఏ దర్శకుడైన ఒకసారి హిట్ కొట్టాడా ఇక నిర్మాతలంతా అతని వెంటే పడతారు. వెంటనే తమ బ్యానర్ లో ఆ నిర్మాతని లాక్ చెయ్యడానికి పెద్ద మొత్తంలో అడ్వాన్స్ లు ఆ దర్శకుడి చేతిలో పెడతారు. తర్వాత ఆ దర్శకుడు తమకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయి తమతో సినిమా చెయ్యకుండా తప్పించుకు తిరుగుతున్నదంటే చాలు ఆ నిర్మాతకు మండుతుంది. అలాగే ఏ ఫిలిం ఛాంబర్ లోనో ఆ దర్శకుడిపై కంప్లైంట్ చేసి దర్శకుడి ముక్కు పిండి తమ డబ్బులు వసూలు చేస్తారు. లేదంటే ఆ దర్శకుడు చెయ్యబోయే ప్రాజెక్ట్ విషయంలో నానా హంగామా చేస్తారు. మహేష్ మహర్షి విషయంలో ఇదే జరిగింది. అలాగే త్రివిక్రమ్ నుండి మైత్రి వాళ్లు కూడా ఇచ్చిన అడ్వాన్స్ ని వెనక్కి తీసుకునే పనిలో ఉన్నారనే వార్తలొస్తున్నాయి కూడా.

అడ్వాన్స్ ఇచ్చిన అశ్వినీదత్

తాజాగా మరో దర్శకుడు కూడా ఇలాంటి సమస్యల్లో ఇరుకున్నాడట. ఇష్క్, మనం సినిమాలతో లైం టైంలోకి వచ్చిన విక్రమ్ కుమార్... అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాలని కలగన్నాడు. కానీ విక్రమ్ కథ నచ్చని అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చెయ్యడానికి రేడి అవుతున్నాడు. అయితే అల్లు అర్జున్ తో ఛాన్స్ మిస్ చేసుకున్న విక్రమ్ కుమార్ తన కథతో నానిని లైన్ లో పెట్టాడంటున్నారు. ఇలాంటి టైంలో విక్రమ్ కుమార్ మీద టాలీవుడ్ నిర్మాత ఒకరు ఫైర్ అవుతున్నారు. తమ అడ్వాన్స్ ఇవ్వలేకపోతే ఫైన్ కట్టమంటున్నారు. ఇష్క్ సినిమా హిట్ తో జోరుగా దూసుకుపోతున్న విక్రమ్ తో సినిమా చేసేందుకు వైజయంతి బ్యానర్ లో అశ్వినీదత్ విక్రమ్ కి అడ్వాన్స్ ఇచ్చాడట. కానీ 24 సినిమా తర్వాత విక్రమ్ వేరే బ్యానర్స్ లో సినిమాలు చేశాడు కానీ వైజయంతి వారికి ఛాన్స్ ఇవ్వలేదు.

దర్శకుడికి ఫైన్...

ఈ విషయమై అశ్వినిదత్ ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించాడట. అక్కడ దర్శకుల సంఘంలో పంచాయితీ కూడా అయ్యిందట. అయితే ఆ పంచాయితీలో పెద్దలంతా కలిసి విక్రమ్ కుమార్ కి ఫైన్ వేసారని తెలిసింది. విక్ర‌మ్ కె.కుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ బ్యాన‌ర్‌లో అయినా చేయొచ్చు.. కానీ తనకొచ్చే పారితోషికంలో రూ.1.5 కోట్లు అశ్వ‌నీద‌త్‌కి చెల్లించాలి అని చెప్పారట. మరి నానితో విక్రమ్ కుమార్ చెయ్యబోయే సినిమాకి ఏ నిర్మాతలైన విక్రమ్ కి ఇచ్చే పారితోషకంతో అశ్వనీదత్ అప్పు తీర్చేయ్యొచ్చన్నమాట.

Similar News