వైఎస్ జగన్ పై బాలయ్య ఎటాక్

Update: 2017-08-16 06:30 GMT

నందమూరి నటసింహం నంద్యాలలో రెచ్చిపోయారు. నంద్యాలలో ఈరోజు బాలకృష్ణ రోడ్డు షో నిర్వహించారు. వైసీపీ అధినేత జగన్ పేరెత్తకుండానే ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు బాలకృష్ణ. వైఎస్ జగన్ చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి వేయాలని చేసిన వ్యాఖ్యలకు బాలకృష్ణ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఓటు తూటాతో అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిని కాల్చేయాలని పార్టీ కార్యకర్తలకు, తన అభిమానులకు బాలయ్య బాబు పిలుపు నిచ్చారు. నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ బాలయ్యను రంగంలోకి దించింది. ఎన్నికల ప్రచారానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో బాలకృష్ణ బుధవారం నంద్యాలలో రోడ్ షోలు నిర్వహించారు. రోడ్ షోకు బాలయ్య అభిమానులు అధికసంఖ్యలో హాజరయ్యారు.

ఓటు తూటాతో కాల్చండి........

హంస మాటలు చెప్పి కోతిచేష్టలు చేస్తున్న వారిని దగ్గరకు రానివ్వొద్దని బాలకృష్ణ పిలుపు నిచ్చారు. భూమా నాగిరెడ్డి కుటుంబం ప్రస్తుతం కష్టాల్లో ఉందని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత నంద్యాల ప్రజలపై ఉందన్నారు బాలకృష్ణ. నంద్యాల పట్టణం అభివృద్ధికి నోచుకోవాలంటే టీడీపీ అభ్యర్థికే ఓటువేయాలని బాలయ్య బాబు కోరారు. భూమా కుటుంబానికి అండగా నిలిచి, నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రతి పనికీ అడ్డుతగులుతున్న ప్రతిపక్షాన్ని ఇంటికి పంపితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని బాలయ్యబాబు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కోసం ఎంతో శ్రమిస్తున్నారన్నారు. చంద్రబాబుకు, భూమా కుటుంబానికి అండగా నిలవాలని ఆయన కోరారు. బాలకృష్ణ రోడ్ షో కు విపరీతమైన స్పందన లభిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది.

Similar News