బాబు పై ఫైర్ అవుతున్న టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే

Update: 2017-11-12 08:30 GMT

ఆయ‌న టీడీపీలో ఓ సీనియ‌ర్ ఎమ్మెల్యే. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా వ‌రుస‌గా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. స‌ద‌రు ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు పేరు చెపితేనే తెగ ఫైర్ అయిపోతున్నార‌ట. ఈ విష‌యం ఇప్పుడు ఏపీ టీడీపీ వ‌ర్గాల్లో పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఇంత‌కు బాబుపై ఆ రేంజ్‌లో ఫైర్ అయిపోతోన్న సీనియ‌ర్ ఎమ్మెల్యే ఎవ‌రో కాదు గుంటూరు జిల్లా పోన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌కుమార్‌. పొన్నూరు నుంచి 1994 నుంచి 2014 వ‌ర‌కు వ‌రుస‌గా ఐదు ఎన్నిక‌ల్లో ఓట‌మి లేకుండా గెలుస్తూ వ‌స్తోన్న న‌రేంద్ర పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు త‌న వాయిస్‌ను చాలా బ‌లంగా వినిపించారు.

అధికార‌ప‌క్షంపై ఆయ‌న ఓ రేంజ్‌లో ఫైట్ చేసేవారు. 2004లో వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గాలిలో గుంటూరు జిల్లాలో ఉన్న 19 ఎమ్మెల్యే సీట్ల‌లో కాంగ్రెస్ 18 గెలిస్తే, పొన్నూరులో మాత్రం న‌రేంద్ర గెలిచారు. నాడు జిల్లా స‌మావేశాల్లోను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఒకే ఒక్క‌డిగా ఉన్న న‌రేంద్ర అధికార‌ప‌క్షంపై ధీటుగా ఫైట్ చేసేవారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్ర‌మాల‌పై ప‌దే ప‌దే మీడియాలో బ‌లంగా త‌న వాయిస్ వినిపించేవారు. అలాంటి న‌రేంద్ర ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోవ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లోను పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌నే అల‌క‌:

ఏపీలో టీడీపీ అధికారంలోకి రావ‌డంతో త‌న‌కు గ్యారెంటీగా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని న‌రేంద్ర ధీమాతో ఉన్నారు. అయితే చంద్ర‌బాబు మాత్రం న‌రేంద్ర‌కు మొండిచేయి చూపించారు. న‌రేంద్ర‌కంటే జూనియ‌ర్ అయిన ప్ర‌త్తిపాటి పుల్లారావుకు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. అప్ప‌టి నుంచి న‌రేంద్ర బాబుతో పాటు పార్టీపై అల‌క‌బూనారు. అయితే న‌రేంద్ర‌కు మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డం వెన‌క కొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయ‌న్న‌ది జిల్లాలో బ‌లంగా వినిపించే టాక్‌. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు సంగం డెయిరీ చైర్మ‌న్ ప‌ద‌విని ఇత‌రుల‌కు ఇవ్వాల‌ని బాబు సూచించారు. అయితే బాబు మాట పెడ‌చెవిన పెట్టిన న‌రేంద్ర ఆ చైర్మ‌న్ ఎన్నిక టైంలో బాబుకు ఫోన్‌ లో కూడా అందుబాటులో లేకుండా పోయార‌ట‌. ఇక గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల్లో సంగం డెయిరీ ఆధిప‌త్యం ఉంది. ఇక లోకేష్ త‌మ హెరిటేజ్ మార్కెట్‌కు కాస్త వెసులుబాటు క‌ల్పించాల‌ని న‌రేంద్ర‌పై ఒత్తిడి చేసినా న‌రేంద్ర లైట్ తీస్కొన్నార‌న్న గుస‌గుస‌లు కూడా వినిపించాయి. ఈ రెండు విష‌యాల్లో బాబు, లోకేష్ మాట‌ను న‌రేంద్ర ప‌ట్టించుకోక‌పోవ‌డంతో న‌రేంద్ర‌కు సంగం డెయిరీ చైర్మ‌న్ ప‌ద‌విని సాకుగా చూపి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా షాకు ఇచ్చార‌ని టాక్‌.

నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం :

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత న‌రేంద్ర పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో సీఆర్‌డీఏ ఎక్కువుగా విస్త‌రించి ఉంది. పెద‌కాకాని మండ‌లంలో భూసేక‌ర‌ణ‌, ఇత‌ర‌త్రా అంశాల హ‌డావిడా చాలా ఎక్కువుగా న‌డిచింది. అయితే న‌రేంద్ర మాత్రం చాలా సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు న‌రేంద్ర వాయిస్ ఎక్క‌డా విన‌ప‌డ‌డం లేదు. ఇప్పుడు జిల్లాలో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయ‌ణ‌, ఇక జిల్లాకు చెందిన మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు, స్పీక‌ర్ కోడెల‌తో పాటు న‌రేంద్ర కంటే జూనియ‌ర్లు అయిన జీవి.ఆంజ‌నేయులు, య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావుల హ‌డావిడే ఎక్కువుగా క‌నిపిస్తోంది. ఒక‌ప్పుడు స్టేట్ పాలిటిక్స్‌లో ఓ వెలుగు వెలిగిన న‌రేంద్ర ఇప్పుడు కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమిత‌మైపోయారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అధిష్టానం త‌నను బాగా వాడుకుని ఇప్పుడు త‌న‌ను ప‌క్క‌న పెట్టేసింద‌ని న‌రేంద్ర త‌న సన్నిహితుల వ‌ద్ద ప‌దే ప‌దే వాపోతున్నార‌ట‌.

ఎప్పుడూ లేనంత వ్య‌తిరేక‌త :

న‌రేంద్ర‌కు తండ్రి, మాజీ మంత్రి వీర‌య్య చౌద‌రి వేసిన పునాది, త‌న ఓన్ క్రేజ్ బాగానే ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ప్ర‌స్తుతం ఎప్పుడూ లేనంత వ్య‌తిరేక‌త ఉన్న‌ట్టు జిల్లాలో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఓ వైపు పార్టీలో ప్ర‌యారిటీ లేద‌ని న‌రేంద్ర నిర్వేదంగా ఉండ‌డం, మ‌రోవైపు త‌మ్ముడి వ్య‌వ‌హార శైలీ, రెండున్న‌ర ద‌శాబ్దాలుగా ఎన్నిక‌వుతూ వ‌స్తుండ‌డంతో న‌రేంద్ర‌పై నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌తిరేక‌త ఉంది. అయితే నియోజ‌క‌వర్గంలో వైసీపీ చాలా వీక్‌గా ఉండ‌డం, స‌రైన ప్ర‌త్య‌ర్థి లేకపోవ‌డం కూడా న‌రేంద్ర‌కు రాజ‌కీయంగా క‌లిసిరానుంది. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పొన్నూరులో రాజకీయ స‌మీక‌ర‌ణ‌లు ఎలా మార‌తాయో చూడాలి.

Similar News