వీకెండ్ ఎలిమినేషన్ ఎవరో?

అప్పట్లో జగన్ ఫ్రై డే బాయ్ అంటూ ఏడిపించేవారు టీడీపీ నేతలు. ఎందుకంటే ప్రతీ శుక్రవారం జగన్ కోర్టు వాయిదాలకు హాజరయ్యేవారు. ఇపుడు అవే నేతల నోళ్ళు [more]

Update: 2020-11-28 02:00 GMT

అప్పట్లో జగన్ ఫ్రై డే బాయ్ అంటూ ఏడిపించేవారు టీడీపీ నేతలు. ఎందుకంటే ప్రతీ శుక్రవారం జగన్ కోర్టు వాయిదాలకు హాజరయ్యేవారు. ఇపుడు అవే నేతల నోళ్ళు మూతలు పడేలా శాటర్ డే ఫీవర్ వారిని కలిగించడంలో వైసీపీ సూపర్ సక్సెస్ అయింది. గత కొన్ని నెలలుగా శాటర్ డే వచ్చిందంటే చాలు టీడీపీ నేతలు, వారితో రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తున్న వారి వెన్నులో వణుకు మొదలవుతోంది. బిగ్ బాస్ లో వీకెండ్ ఎలిమినేషన్ మాదిరిగా ఈసారి వాటా ఎవరిది అని లెక్కలు వేసుకోవడం విపక్ష నేతల వంతు అవుతోంది. ఇంతకీ శాటర్ డే సంగతేంటి అంటే చాలానే ఉంది మరి.

అదీ లెక్క …..

కోర్టుకు వారాంతంలో సెలవులు ఉంటాయి. దాంతో టీడీపీ నేతలు, అక్రమార్కుల పని పట్టేందుకు వైసీపీ ఏలుబడిలో విశాఖ అధికారులు ఎంచుకున్న వారమే శనివారం. శనివారం తెల్లారుతూనే భూ కబ్జా గాళ్ళకు చుక్కలు చూపించే కధలు మొదలైపోతున్నాయి. ఇది మాజీ ఎంపీ సబ్బం హరితో మొదలై ఇపుడు గంటా అనుచరులు కాశీ విశ్వనాధం దాకా వచ్చేసింది. కనీసం రెండు రోజుల పాటు అయినా తాము అనుకున్న పని సవ్యంగా చేయడానికి వీలు కోసమే శాటర్ డేను ఎంచుకున్నారని టాక్. దాంతో శాటర్ డే వస్తే చాలు హడలెత్తిపోతున్నాయి విపక్షాలు.

అదే ముహూర్తం కూడా….

ఈ మధ్య దాకా శాటర్ డే ముహూర్తంగానే చేసుకుని గీతం విద్యా సంస్థల మీద దాడులు చేశారు. విశాఖ నడిబొడ్డున ఉన్న ఫ్యూజన్స్ ఫూడ్స్ ని సీజ్ చేశారు. గంటా భూములు అని చెప్పబడుతున్న ఆనందపురంలోని ప్రభుత్వ భూములను స్వాధీనం చేస్తున్నారు. అయితే వీటన్నిటికీ సోమవారం అవుతూనే స్టేలు వచ్చేశాయి. అదే వేరే సంగతి కానీ కనీసం నలభై ఎనిమిది గంటలు నరకం చూపించడానికి వైసీపీ సర్కార్ వేస్తున్న కొత్త ఎత్తుగడతో విశాఖలోని విపక్షం విలవిలలాడుతోంది. ఈ పరిణామాలతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అయితే బెంబేలెత్తుతోంది.

బెంచ్ కావాలట….

పాపం టీడీపీ నేతలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు, వాటిని చూడలేక ఒకనాటి మిత్రుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు అయితే ఓదార్పు మాటలే వారికి చెబుతున్నారు. పనిగట్టుకుని మరీ వీకెండ్స్ లోనే ఆక్రమణల మీద వైసీపీ సర్కార్ దాడులు చేయిస్తోందని రాజు గారు అంటున్నారు. దీని వల్ల బాధితులు కోర్టులకు వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అంటున్నారు. అందువల్ల విశాఖలో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే వారికి తమ గోడు వెళ్ళబోసుకునేందుకు సదుపాయంగా ఉంటుందని సెటైర్లు కూడా వేశారు. ఎవరేమన్నా కూడా విశాఖలో మాత్రం ఈ రకమైన తంతు సాగిపోతూనే ఉంది. సిట్ ఇచ్చిన నివేదికలో విశాఖ భూ కబ్జాలలో చాలా మంది పెద్ద తలకాయలు ఉన్నాయని కాబట్టి ఇది టీవీ సీరియల్ మాదిరిగా జీడిపాకంలా కొన్నేళ్ళ పాటు సాగాల్సిందేనని వైసీపీ నేతలు అసలు విషయం చెప్పేస్తున్నారు.

Tags:    

Similar News