యువనేత మళ్లీ విన్నర్ అవుతారట..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆవిర్భావం నుంచి అండగా ఉన్న మేకపాటి కుటుంబానికి ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి [more]

Update: 2019-05-19 01:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆవిర్భావం నుంచి అండగా ఉన్న మేకపాటి కుటుంబానికి ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈసారి పోటీకి దూరంగా ఉండటంతో ఆ కుటుంబానికి ఈసారి రెండు అసెంబ్లీ టిక్కెట్లు మాత్రమే ఇచ్చారు జగన్. దీంతో ఈ రెండు స్థానాలను గెలుచుకోవాలని మేకపాటి కుటుంబం పట్టుదలగా ఉంది. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు మేకపాటి గౌతంరెడ్డి ఈసారి కూడా కచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో సర్వశక్తులు ఒడ్డారు. గత ఎన్నికల్లో మొదటిసారి ఇక్కడి నుంచి పోటీ చేసిన గౌతంరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నబాబుపై 31,412 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అప్పుడు రాజమోహన్ రెడ్డి ఎంపీగా గెలవడానికి కూడా ఆత్మకూరు నియోజకవర్గమే కారణం. ఇక్కడ వచ్చిన మెజారిటీతోనే ఆయన నెల్లూరు ఎంపీగా స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. ఇలా గత ఎన్నికల్లో తండ్రీ కుమారులను పదవుల్లో కూర్చోబెట్టిన ఆత్మకూరు నియోజకవర్గంలో ఈసారి పరిస్థితి మారిందనే అంచనాలు ఉన్నాయి.

గౌతంరెడ్డి పట్ల వ్యతిరేకత…

ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న గౌతంరెడ్డి పట్ల నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉంది. ప్రతిపక్ష పార్టీలో ఉండటంతో ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. తన తండ్రి ఎంపీ నిధులతో కొన్ని పనులు చేసినా ప్రజల్లో మాత్రం సంతృప్తి లేదు. పైగా గౌతంరెడ్డి ప్రజల్లోకి చొచ్చుకువెళ్లలేకపోయారని భావన ఉంది. దీంతో సహజంగానే ఆయన పట్ల గత ఎన్నికల్లో ఉన్నంత సానుకూలత ఈసారి కనిపించలేదు. అయితే, ఆయన విజయానికి మేకపాటి కుటుంబంతో పాటు ఆనం రాంనారాయణరెడ్డి కూడా బాగానే ప్రయత్నించారు. ఆనంకు సైతం ఆత్మకూరు నియోజకవర్గంలో పట్టుంది. ఆయనకు వ్యక్తిగతంగా కొత ఓటు బ్యాంకు ఉంది. దీంతో ఆనం సైతం ఇక్కడ గౌతంరెడ్డి తరపున ప్రచారం చేశారు.

ఆయనకే విజయావకాశాలు

తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య పోటీ చేశారు. ఆయన గతంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. నియోజకవర్గంలో ఆయనకు పరిచయాలు బాగానే ఉన్నాయి. దీంతో ఆయన ఈసారి విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. కానీ, ఎక్కువగా ఆయన పార్టీ బలంపైనే ఆధారపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. మొత్తంగా ఈసారి గౌతంరెడ్డి పట్ల పెద్దగా సానుకూలత లేకపోయినా ఆనం చేరిక కలిసి రావడం, జిల్లాలో పోలింగ్ సరళి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందనే అంచనాలు ఉన్నందున మరోసారి గౌతంరెడ్డికే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, మెజారిటీ మాత్రం గత ఎన్నికల కంటే బాగా తగ్గి స్వల్ప మెజారిటీతో బయటపడవచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News