అనుకున్నదానికి రివర్స్ అయితే…?

తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది అంటే ఒక్క ముక్కలో చెప్పొచ్చు. గ్రామాల్లో రాబందుల్లా జన్మభూమి కమిటీలు జనం మీద పడి పిండుకు తినేశాయని. పేద అవ్వకు పించను [more]

Update: 2019-08-23 11:00 GMT

తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది అంటే ఒక్క ముక్కలో చెప్పొచ్చు. గ్రామాల్లో రాబందుల్లా జన్మభూమి కమిటీలు జనం మీద పడి పిండుకు తినేశాయని. పేద అవ్వకు పించను వేయి రూపాయలు వస్తే అందులో వీర ముష్టికి చేతులు చాచే పచ్చ చొక్కాలే జన్మభూమి కమిటీ సభ్యులు. రేషన్ కార్డు ఇవ్వాలన్నా వారే, స్కీం ఇళ్ళు ఇప్పించాలన్నా వారే, ఆఖరుకు ఏ పధకం అవసరం అయినా వారే దిక్కు అన్నట్లుగా మొత్తం వ్యవస్థను మార్చేసింది. నాటి టీడీపీ సర్కార్. ఆ బాధలు బయట ఎవరికీ చెప్పుకోలేని గ్రామ ప్రజానీకం మొత్తానికి మొత్తం వైసీపీకి ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించేసింది. జగన్ పాదయత్రంలో ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినవి జన్మభూమి కమిటీల మీదనే కావడం విశేషం. ఇక జగన్ కి కూడా వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు ఆలోచనకు ప్రాతిపదిక ఈ జన్మభూమి కమిటీలు అయి ఉండొచ్చు కూడా.

దానికి మారుగానా….

నిజానికి ఈ సందేహం ప్రజల్లోనే ఎక్కువగా ఉంది. దానికి ఆజ్యం పోస్తున్నది ప్రతిపక్షం . ఇపుడు స్వపక్షంలో కూడా ఆ రకమైన హెచ్చరికలు, జాగ్రత్తలు రావడంతో కొంపదీసి జన్మభూమి కమిటీలకు మారుగా ఇది రూపల్పన చేశారా అన్న డౌట్లు పెద్ద ఎత్తున వచ్చిపడుతున్నాయి. నిజానికి జగన్ ఆలోచన ఏంటి అంటే జన్మభూమి కమిటీలకు ఏ రకమైన ఆదాయవనరూ లేకుండా చంద్రబాబు జనాలను దోచుకుతినమని అప్పగించారని, తాను అలా కాకుండా వాలంటీర్లను కొంత మేర జీతం ఇచ్చి పనులు అప్పగిస్తే వారు అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు ఉపయోగపడతారని. ఇది నిజంగా మంచిదే. కానీ ఆచరణలో ఎలా ఉంటుందోనన్నదే అందరి భయం. ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్ ని నియమించారు. వారికి ఆ వాలంటీర్ పూర్తిగా పరిచయం అయిపోతాడు. అంతే కాదు, అతనే నెలకు సరకు ఇంటికి తెస్తాడు, గ్రామ సచివాలాయం నుంచి అయ్యే ప్రతి పని కూడా వాలంటీర్ ద్వారానే జరుగుతుంది. అలాగే సంక్షేమ పధకాలు కూడా వాలంటీర్లు చూస్తారు. వారే అర్హులను గుర్తిస్తారు. వారే రేషన్ కార్డుల విషయంలో కూడా పంపిణీ చేస్తారు. జగన్ మాటల్లో చూసుకుంటే ఒక వాలంటీర్ గ్రామంలో ఆ యాభై ఇళ్లకు సర్వస్వం అన్న మాట. అతను కలెక్టర్ చేసే పనులన్నీ చేయవచ్చు అని కూడా ముఖ్యమంత్రి అన్నారంటే ఎంత‌టి గురుతర బాధ్యత అప్పగించారో అర్ధమవుతుంది.

మరక తెస్తారా….

పెద్ద ఎత్తున లక్షల్లో వాలంటీర్లను వైసీపీ సర్కార్ నియమించింది. వారికి అపరిమిత అధికారాలను ఇచ్చింది. బాధ్యతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. జీతం మాత్రం అయిదు వేల రూపాయలు మాత్రమే. మరి ఇపుడున్న పరిస్థితుల్లో వాలంటీర్లు కూడా జన్మభూమి కమిటీ సభ్యులు మాదిరిగా విచ్చలవిడిగా ప్రవర్తించరని గ్యారంటీ ఏమీ లేదు. వారు సైతం ఈ సమాజం నుంచే వచ్చారు. ఎక్కడ నుంచో ఊడి పడలేదు. లక్షల్లో జీతాలు తీసుకునే వారు కూడా లంచం అడుగుతున్న ఈ రోజుల్లో అయిదువేల రూపాయల వాలంటీర్ల నుంచి నిజాయతి ఆశించడం భ్రమ మాత్రమే అవుతుంది. అయితే అందరూ కాదు కానీ కొంత మంది తప్పు చేసినా మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. దాంతో పాటు ప్రభుత్వానికి కూడా మచ్చ పడుతుంది. అందుకే దీని మీద ఇపుడు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వాలంటీర్లను ఒకటికి పదిమార్లు హెచ్చరిస్తున్నారు. జన్మభూమి కమిటీల్లా చేయవద్దు అని విశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు లాంటి వారు అంటున్నారంటే అవినీతికి బాగా ఆస్కారం ఉందనేగా అర్ధం. మరి వారిని నియంత్రించే యంత్రాంగం ప్రభుత్వం వద్ద ఎంతవరకూ ఉందో, వారి కధ ఏంటో కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. ఏది ఏమైనా ఉన్నంతలో మంచి వ్యవస్థగా గ్రామ వాలంటీర్లను చెప్పుకోవాలి. ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఉంటే మంచిదనే ఆశించాలి.

Tags:    

Similar News