ఈ వైసీపీ ఎంపీల‌ను గుర్తు ప‌ట్టడం క‌ష్టమేనా ?

ఏపీలో ఉన్న 25 మంది ఎంపీల‌లో అధికార వైసీపీకి ఏకంగా 22 మంది లోక్‌స‌భ స‌భ్యులు ఉన్నారు. 25 మందికి 25 మంది ఎంపీల‌ను గెలిపిస్తే ప్రత్యేక [more]

Update: 2021-06-02 13:30 GMT

ఏపీలో ఉన్న 25 మంది ఎంపీల‌లో అధికార వైసీపీకి ఏకంగా 22 మంది లోక్‌స‌భ స‌భ్యులు ఉన్నారు. 25 మందికి 25 మంది ఎంపీల‌ను గెలిపిస్తే ప్రత్యేక హోదా దానంత‌ట అదే వ‌స్తుంద‌ని జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందే ప‌దే ప‌దే చెప్పారు. క‌ట్ చేస్తే 22 మంది ఎంపీల‌ను గెలిపించడంతో పాటు ఏకంగా 151 మంది ఎంపీల‌ను కూడా గెలిపించిన ఏపీ ప్రజలు వైసీపీకి అప్రతిహ‌త అధికారం క‌ట్టబెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా అన్న ఊసే లేదు స‌రిక‌దా ? క‌నీసం పోల‌వ‌రం, ఏపీకి విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం రావాల్సిన నిధులు, ఇత‌ర అంశాల గురించి అటు పార్లమెంటులో ఒక్క మాట మాట్లాడే ఎంపీయే క‌న‌ప‌డ‌డం లేదు. ఈ క‌రోనా క‌ష్టకాలంలో క‌నీసం ప్రజ‌ల‌కు అయినా ఏదైనా సేవ చేస్తున్నారా ? అంటే అదీ లేదు.

రెండేళ్లలో…?

ఈ రెండేళ్లలో వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి చేసింది.. సాధించింది శూన్యం. ఇంకా చెప్పాలంటే ఈ 22 మంది ఎంపీలు క‌నీసం పార్లమెంటులో ఒకేసారి క‌నిపించిన సంద‌ర్భాలు కూడా త‌క్కువే. ర‌ఘురామ కృష్ణంరాజు రెబ‌ల్ అయిపోయారు. మిగిలిన వాళ్లలో నెల్లూరు, ఒంగోలు ఎంపీలు అస‌లు ప్రజాక్షేత్రంలో ఉన్నారా ? వారు వైసీపీ ఎంపీలేనా ? అని ప్రశ్నించుకుంటే ర‌క‌ర‌కాల సందేహాలు. వారిద్దరు వ్యాపారాల్లోనే ఎక్కువ బిజీబిజీగా ఉంటోన్న ప‌రిస్థితి. ఇక పార్టీ త‌ర‌పున గెలిచిన మ‌హిళా ఎంపీల్లో మాధ‌వి, స‌త్యవ‌తి, అనూరాధ‌, వంగా గీత ఏం చేస్తున్నారో కూడా తెలియ‌దు. త‌మ‌కు ఎంపీ ప‌ద‌వి ఉంది చాలు అలంకారం అన్న చందంగా వీరు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం…?

మ‌హిళా ఎంపీలుగా అనేకానేక స‌మ‌స్య‌ల‌పై వీరు పార్లమెంటులో త‌మ వాణి వినిపించి బ‌ల‌మైన ముద్ర వేసుకునే ఛాన్స్‌ను కూడా వారు స‌ద్వినియోగం చేసుకోలేని ప‌రిస్థితి. సీమ ఎంపీల్లో ఎవ్వరూ ప్రజల్లో ఉండే ప‌రిస్థితి లేదు. అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి స్థానిక రాజ‌కీయాల్లో, ఇటు వ్యాపారాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండ‌డం మిన‌హా రాష్ట్ర ప్రయోజ‌నాల కోసం కోట్లాడింది లేదు. ఒక‌ప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 42 మంది ఎంపీలు ఉంటే స‌గ‌టు రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న వాళ్లకు కూడా ఇత‌ర ప్రాంతాల ఎంపీల ఫొటోలు చూస్తే పేరు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఏపీలో చాలా మంది ఎంపీల ఫొటోలు చూసినా చెప్పలేని ప‌రిస్థితి ఉందంటే వీరు.. ప్రజ‌ల్లో ఎంత మాత్రం ఉంటున్నారు ? ప్రజా స‌మ‌స్యల కోసం ఎలా పోరాడుతున్నారో ? అర్థమ‌వుతోందన్న విమ‌ర్శలు అయితే ఉన్నాయి.

ఉన్నా వేస్టేనా?

విచిత్రం ఏంటంటే టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలే క‌రోనా సెకండ్ వేవ్ ముందు వ‌ర‌కు పార్లమెంటులో కాస్తో కూస్తో హ‌డావిడి చేస్తూ వ‌చ్చారు. కేశినేని నాని, గ‌ల్లా జ‌య‌దేవ్‌, అటు రామ్మోహ‌న్ నాయుడు ముగ్గురూ ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర హ‌క్కుల కోసం ఉన్నంత‌లో పోరాటం చేశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నిక‌ల ముందు నుంచి.. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత వీరు కూడా సైలెంట్ అయ్యి ప్రజ‌ల్లోకి రావ‌డం మానేశారు. ఏదేమైనా వైసీపీకి 22 మంది లోక్‌స‌భ స‌భ్యులు, ఇంత మంది రాజ్యస‌భ స‌భ్యులు ఉండి కూడా 90 శాతం మంది ఎంపీల మొఖాలు జ‌నాల‌కు తెలియ‌ని ప‌రిస్థితి, వారిని చూసి రోజులకు రోజులు అయిపోయిన ప‌రిస్థితి ఉండ‌డం బాధాక‌రం.

Tags:    

Similar News