యువ ఎంపీలు ఏమ‌య్యారు? కాస్త చెబుదురూ…!

రాష్ట్రంలో వైసీపీ 22 మంది ఎంపీల‌ను గెలుచుకుంది. దీంతో రాష్ట్ర ప్రజ‌లు ఇకేంముంది.. రాష్ట్రానికి సంబంధించినంత వ‌ర‌కు అంతా న్యాయ‌మే జ‌రుగుతుంద‌ని అనుకున్నారు. అటుఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ [more]

Update: 2020-05-24 02:00 GMT

రాష్ట్రంలో వైసీపీ 22 మంది ఎంపీల‌ను గెలుచుకుంది. దీంతో రాష్ట్ర ప్రజ‌లు ఇకేంముంది.. రాష్ట్రానికి సంబంధించినంత వ‌ర‌కు అంతా న్యాయ‌మే జ‌రుగుతుంద‌ని అనుకున్నారు. అటుఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ కూడా 25 మంది ఎంపీల‌ను గెలిపిస్తే ప్రత్యేక హోదా దానంత‌ట అదే వ‌స్తుంద‌ని ప‌దే ప‌దే చెప్పేవారు. ఇక 22 మంది లోక్‌స‌భకు వైసీపీ ఎంపీల‌ను ఏపీ ప్రజ‌లు వైసీపీకి ఇచ్చినా ప్రత్యేక హోదా కాదు క‌దా…. ఏపీకి కేంద్రం నుంచి క‌నీస ప్రాజెక్టులు తెచ్చేందుకు కూడా అడిగేందుకు ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా ప‌ట్టించుకున్న పాపాన పోవ‌డం లేదు.

అందరూ యువకులే…..

వైసీపీ నుంచి గెలిచిన ఎంపీలు అంద‌రూ యువ‌కులే కావ‌డంతో వీరంతా నిత్యం త‌మ‌కు అందుబాటులో కూడా ఉంటార‌ని భావించారు. కొత్త ర‌క్తం కావ‌డంతో పాటు వీరిలో ఉన్నత విద్యావంతులు ఎక్కువుగా ఉండ‌డంతో వారంతా ఉత్సాహంగా ప‌నిచేస్తార‌ని అనుకున్నారు. కానీ, ఈ మెజారిటీ యువ ఎంపీల్లో మెజారిటీ శాతం .. అడ్రస్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు కూడా యువ ఎంపీలు చాలా మందే ఉన్నారు. వీరిలో ఇద్దరు నుంచి ముగ్గురు త‌ప్ప.. మిగిలిన ఎంపీలు పెద్దగా ప్ర‌జ‌ల మ‌ధ్యకు రావడం లేదు. పైగా త‌మ సొంత వ్యవ‌హారాలు.. వ్యాపారాల్లోనే మునిగిపోయార‌ని తెలుస్తోంది.

కొందరు తప్ప…

ప్రస్తుతం లాక్‌డౌన్ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ మూత‌బ‌డ్డాయి. కొన్ని తెరుచుకున్నా ఉపాధి దొరకడం లేదు. దీంతో పేద‌లు తీవ్ర ఆర్ధిక స‌మ‌స్యల్లో అల్లాడుతున్నారు. కొంద‌రు చిన్న త‌ర‌హా వ్యాపారులు సైతం రోడ్డున ప‌డ్డారు. మ‌రి వీరిని ఆదుకునే బాధ్యత ఆయా ఎంపీలు ఉందా? అంటే ఉంటుంది క‌దా! కానీ,వారు ఎక్కడా స్పందించ‌డం లేదు. న‌ర‌సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవ‌రాయులు, ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీధ‌ర్ వంటి ఒక‌రిద్దరు మిన‌హా మిగిలిన ఎంపీలు ఇళ్లకే ప‌రిమిత‌మ‌య్యారు. లేదా అస‌లు కొంద‌రు రాష్ట్రానికే రాకుండా ఇత‌ర ప్రాంతాల్లో ఉంటున్నారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రజ‌లు వీరిపై మండి ప‌డుతోన్న ప‌రిస్థితి ఉంది.

ప్రజల్లోకి వెళ్లకుండా…

మ‌రి కొంద‌రు వైసీపీ ఎంపీలు హ‌డావిడి చేస్తూ రు. 5 వేలో లేదా రు. 10 వేలో ఇచ్చి మీడియాను పిలిపించుకుని చేస్తోన్న హంగామా న‌వ్వులాట‌గా మారింది. ఇక తాజాగా.. విజ‌య‌న‌గ‌రంలో ఎంపీల‌ ప‌రిస్థితిపై ఒక‌రు స్పంద‌నలో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం స్పంద‌న కార్యక్రమం ఫోన్ ద్వారా జ‌రుగుతున్న క్రమంలో ఓ వ్యక్తి ఫోన్ చేసి.. మా ఎంపీగారు ఎక్కడున్నార‌ని అధికారుల‌ను ప్రశ్నించ‌డంతో వారంతా ఖంగుతిన్నారు. ఈ విష‌యం తాజాగా సీఎం జ‌గ‌న్ దృష్టికి కూడా వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. సీమ జిల్లాల్లో యాక్టివ్‌గా ఉండి వ‌రుస‌గా గెలిచిన ఇద్దరు ఎంపీలు ఎక్కడున్నారో తెలియ‌ని ప‌రిస్థితి. ఇక అధికారులుగా ఉండి ఎంపీలు అయిన వారు కూడా ప్రజ‌ల్లోకి వెళ్లడం లేదు. ఇదీ ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ ఎంపీల ప‌రిస్థితి.

Tags:    

Similar News