వైసీపీది మంచి టైమింగ్‌.. ఇదే స‌రైన స‌మ‌యం

రాజ‌కీయ ప‌రిశీల‌కులు ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. నిన్నటికి నిన్న అచ్చెన్నాయుడు అరెస్టు.. ఆ మ‌రుస‌టి రోజు.. తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాక‌ర్‌రెడ్డి, ఆయ‌న‌త‌న‌యుడు [more]

Update: 2020-06-17 06:30 GMT

రాజ‌కీయ ప‌రిశీల‌కులు ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. నిన్నటికి నిన్న అచ్చెన్నాయుడు అరెస్టు.. ఆ మ‌రుస‌టి రోజు.. తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాక‌ర్‌రెడ్డి, ఆయ‌న‌త‌న‌యుడు అస్మిత్ రెడ్డిల అరెస్టు.. వెర‌సి రెండు రోజుల్లో ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో తీవ్రమైన అల‌జ‌డి రేపే సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ రెండు ఘ‌ట‌న‌ల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నట్టు ఏమైనా రాజ‌కీయ క‌క్షలు ఉన్నాయా ? లేదా.. రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కాల‌నే కుట్రలు ఉన్నాయా ? అంటే.. ఏమీ లేవ‌నే చెప్పాలంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకాదు, మేధావులు కూడా ఇదే త‌ర‌హా అభిప్రాయంతో ఉన్నార‌నేది సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న కామెంట్లను బ‌ట్టి అర్ధమ‌వుతోంది.

నిర్ధారణ చేసుకున్న తర్వాతే…

గ‌త ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించి.. ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ఈ ఏడాది కాలంలో టీడీపీ గ‌త పాల‌న‌పై అధ్యయ‌నం చేసింది. అదే స‌మయంలో ఆయా విభాగాల‌కు అందిన ఫిర్యాదుల‌పైనా.. అధికారులు.. ప్రభుత్వం స‌మ‌గ్రంగా అధ్యయ‌నం చేశాయి. అంటే.. ప్రతి విష‌యంలో టైమింగ్ ప్రకార‌మే.. అధికారులు, ప్రభుత్వం కూడా న‌డుచుకున్నాయ‌నేది వాస్తవం. ఏడాది కాలంలో మాజీ మంత్రి అచ్చెన్నపై వ‌చ్చిన‌.. ఈఎస్ ఐ మందుల కుంభ‌కోణానికి సంబంధించిన ఆరోప‌ణ‌ల‌పై ద‌ర్యాప్తు చేశారు. దీనికి సంబంధించిన అన్ని అంశాల‌ను కేంద్ర ఈ ఎస్ ఐ ఆసుప‌త్రుల నుంచి వ‌చ్చిన ఫిర్యాదు లు.. బ్యాంకు స్టేట్ మెంట్లు వంటి ఆధారంగా నిర్దారించారు.

చిన్న పొరపాటు లేకుండా…?

మంత్రిగా అచ్చెన్న ఇచ్చిన జీవో.. ఇలా అనేక రూపాల్లో అనేక కోణాల్లో విస్తృతంగా ఈ కేసును అధికారులు ద‌ర్యాప్తు జ‌రిపారు. అంతేకాదు, సీఎం జ‌గ‌న్‌కు ఎక్కడా మ‌చ్చ అంట‌కుండా కూడా జాగ్రత్త ప‌డ్డార‌నేది క‌నిపిస్తూనే ఉంది. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. అభూత క‌ల్పన‌కు అవ‌కాశం ఇచ్చినా.. జ‌గ‌న్ ప్రతిష్టకు తీవ్ర విఘాతం ఏర్పడుతుంద‌నేది వాస్తవమ‌ని అధికారులు చాలా జాగ్రత్తగా చ‌ర్యలు తీసుకున్నారు.

రవాణా శాఖకు టోకరా వేసి….

ఇక‌, జేసీ ప్రభాక‌ర్ రెడ్డి అరెస్టు విష‌యంలోనూ ర‌వాణా శాఖ అధికారులు మ‌రిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో బీఎస్‌-3 వాహ‌నాల‌ను కారు చౌక‌కు కొనుగోలు చేసి బీఎస్‌-4 వాహ‌నాలుగా మార్చుకుని వాటిని విక్రయించుకుని కోట్టు కూడ‌బెట్టారు.ఈ క్రమంలో సొంత‌గా ర‌వాణా శాఖ‌ను ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవ‌డం, ఆయ‌న కుమారుడు అస్మిత్ రెడ్డే ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ అవ‌తారం ఎత్తి.. న‌కిలీ స‌ర్టిఫికెట్లు సృష్టించ‌డం వంటి విష‌యాలను అధికారులు చాలా నేర్పుగా బ‌య‌ట‌కు తెచ్చారు. మొత్తంగా ప‌రిశీలిస్తే..ఈ ఏడాది కాలంలో ఈ రెండు కేసులు (ఇప్పటి వ‌ర‌కు బ‌య‌ట‌ప‌డిన‌) విష‌యంలో అధికారులు, ప్రభుత్వం కూడా చాలా టైమింగ్ పాటించింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News