సంఖ్యా బ‌లం ఓకే.. స‌త్తా చాటేవారేరీ ?

ప్ర‌స్తుతం రాష్ట్రానికి కేంద్రం నుంచి అనేక రూపాల్లో సాయం అందాల్సి ఉంది. ప్ర‌త్యేక హోదా తో స‌హా పోలవరానికి నిధులు స‌హా అనేక రూపాల్లో కేంద్రం నుంచి [more]

Update: 2019-09-10 05:00 GMT

ప్ర‌స్తుతం రాష్ట్రానికి కేంద్రం నుంచి అనేక రూపాల్లో సాయం అందాల్సి ఉంది. ప్ర‌త్యేక హోదా తో స‌హా పోలవరానికి నిధులు స‌హా అనేక రూపాల్లో కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. ముఖ్యంగా వైసీపీ అధినేత‌, ప్రస్తుత సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌కు మిక్కిలి సంఖ్య‌లో ఎంపీల‌ను క‌ట్ట‌బెట్టండి కేంద్రం ఎందుకు హోదా ఇవ్వ‌దో చూస్తామ‌ని చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు ఏకంగా 22 మంది ఎంపీలు ద‌క్కారు. వైసీపీ ఓడిపోయిన మూడు ఎంపీ సీట్లు కూడా చాలా స్వ‌ల్ప తేడాతో మాత్ర‌మే కోల్పోయింది.
ఇది నిజానికి అప్ర‌తిహ‌త విజ‌యం. బ‌హుశా భవిష్య‌త్తులో ఇలాంటి విజ‌యం ఏ పార్టీకి ద‌క్కే అవ‌కాశం ఉంటుంద‌ని అనుకోలేం. మ‌రి ఆ రేంజ్‌లో ఎంపీల‌ను కైవ‌సం చేసుకున్నా.. వైసీపీలో మాత్రం నిర్వేదం క‌నిపిస్తోంది.

22 మంది ఎంపీలు లోక్‌స‌భ‌కు ప్రాధాన్యం వ‌హిస్తున్నా.. ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా అనుభ‌వ‌జ్ఞులు లేక పోవ‌డం పెద్ద వెలితిగా ఉంది. తొలిసారి ఎంపీలుగా గెలిచిన వారే ఎక్కువ‌గా ఉండ‌డం, వీరిలోనూ పెద్ద‌గా రాజ‌కీయ కుటుంబాలు లేదా అనుభ‌వం ఉన్న వారు లేక పోవ‌డంతో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం పార్లమెంటులో అనుస‌రించే వ్యూహానికి ప్ర‌తివ్యూహం వేసే నాయ‌కులు పెద్ద‌గా మ‌న‌కు వైసీపీలో క‌నిపించ‌డం లేదు. రాజ‌ధాని గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట‌ విష‌యాన్ని తీసుకున్న ఇక్క‌డ నుంచి యువ‌కుడు, ఉన్న‌త విద్యావంతుడు లావు కృష్ణ‌దేవ‌రాయులు విజ‌యం సాధించారు. అయితే, రాజ‌కీయాలు ఆయ‌న‌కు ఇదే తొలిసారి.

ఇక‌, అర‌కు నుంచి విజ‌యం సాధించిన గొడ్డేటి మాధ‌వి కూడా రాజ‌కీయాల‌కు కొత్తే. అంతేకాదు, మాట్లాడితే.. ఏం జ‌రుగుతుందోన‌నే భ‌యమో.. ఏమో. ఆమె మీడియా ముందుకు కూడా రారు. రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్ కూడా కొత్తే. న‌ర‌సాపురం నుంచి విజ‌యం సాధించిన క‌నుమూరు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కూడా కొత్త‌గానే ఎన్నిక‌య్యారు…ఇలా .. ఈ జాబితాలో చాలా మందే ఉన్నారు. వీరంతా కూడా కేంద్రంలో బ‌ల‌మైన నాయ‌కుల‌తో వాగ్యుద్ధం చేసి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో నిల‌దీసే క‌నిపించ‌డం లేదు.

ఇక కాకినాడ ఎంపీ వంగా గీత గ‌తంలో రాజ్య‌స‌భ ఎంపీగా చేసినా ఇప్పుడు ఆమె వాయిస్ ఏ మాత్రం విన‌ప‌డ‌డం లేదు. ఇక అమ‌లాపురం ఎంపీ చింతా అనూరాధ‌, అన‌కాప‌ల్లి ఎంపీ స‌త్య‌వ‌తి సైతం తొలిసారి ఎంపీలుగా గెలిచారు. వీరిలో కూడా పార్టీకి ఎలాంటి ఉప‌యోగం లేదు. ఇక ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఉన్నా వాళ్ల‌కు వాళ్ల వ్యాపారాలు మిన‌హా ఏం ప‌ట్ట‌వ‌న్న విమ‌ర్శ‌లు ఉండ‌నే ఉన్నాయి. మ‌రి జ‌గ‌న్ ఇలాంటి వారితో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు సాధిస్తారో చూడాలి.

Tags:    

Similar News