బయటకు చెప్పుకోలేని బాధ… ఏం చేయలేని నిస్సహాయత

ఎందుకీ పదవులు… ఉన్నా ప్రయోజనం లేదే.. ఒక్క మాట కూడా చెల్లుబాటు కావడం లేదు. చివరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లోనూ తమకు ప్రయారిటీ లేదు. ఇదీ [more]

Update: 2020-07-21 08:00 GMT

ఎందుకీ పదవులు… ఉన్నా ప్రయోజనం లేదే.. ఒక్క మాట కూడా చెల్లుబాటు కావడం లేదు. చివరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లోనూ తమకు ప్రయారిటీ లేదు. ఇదీ వైసీపీ ఎమ్మెల్యేల వాదన. వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కావస్తుంది. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయారు. ఎటూ అభివృద్ధి పనులు జరగడం లేదు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా తమ చేతులు మీదుగా వెళ్లకపోవడం వైసీపీ ఎమ్మెల్యేలను కుంగదీస్తుంది.

ఏడాదిన్నర నుంచి…..

వైసీపీ ఎమ్మెల్యేలు ఏడాదిన్నర నుంచి ఖాళీగానే ఉన్నారని చెప్పక తప్పదు. ఒక వైపు కరోనా నాలుగు నెలల నుంచి ప్రజల్లోకి వెళ్లడానికి ఇబ్బంది పెడుతోంది. మరోవైపు సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టారు. ఇప్పటికే దాదాపు 28 వేల కోట్లు 3.50 కోట్ల మందికి అందాయన్నది లెక్కలు చెబుతున్న వాస్తవం. అయితే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే లబ్దిదారులకు అందుతున్నాయి.

ఓట్ సోర్సింగ్ పోస్టులను….

తాజాగా జగన్ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. సహజంగా నియోజకవర్గాల్లో ఈ ఉద్యోగాల విషయంలో ఎమ్మెల్యేలపై వత్తిడి ఉంటుంది. అనేక మంది పార్టీకి పనిచేసిన వాళ్లు కావచ్చు. సానుభూతిపరులు కావచ్చు. ఉద్యోగాలకు సిఫార్సు చేయాలని ఎమ్మెల్యేల ఇళ్ల ముందు క్యూ కట్టారు. అయితే ఎమ్మెల్యేలకు తెలియకుండానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ అయ్యాయి.

తమ ప్రమేయం లేకుండానే…

దీంతో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు మండి పడుతున్నారట. ఇన్ ఛార్జి మంత్రులకు, జిల్లాల పార్టీ బాధ్యులకు ఫిర్యాదు చేశారట. ఇలా అయితే తాము క్యాడర్ ను కాపాడుకోలేమని ఎమ్మెల్యేలు నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. సంక్షేమ పథకాల విషయంలోనూ ప్రజలు తమ వద్దకు రావడం లేదని, లబ్దిదారుల ఎంపిక కూడా తమ ప్రమేయం లేకుండా జరగకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీనియర్ నేతలు ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారంటున్నారు. మొత్తం మీద వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు.

Tags:    

Similar News