జగన్ వీరికి నో అబ్జెక్షన్

పోయినోళ్లంతా తిరిగి వస్తామంటున్నారు. విజయసాయిరెడ్డికి ఒకటే ఫోన్లు. ఆయన వారి నుంచి ఫోన్ వస్తే భయపడిపోయే పరిస్థితి. కొందరయితే నేరుగా ఢిల్లీ వెళ్లి విజయసాయిరెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు [more]

Update: 2019-10-16 13:30 GMT

పోయినోళ్లంతా తిరిగి వస్తామంటున్నారు. విజయసాయిరెడ్డికి ఒకటే ఫోన్లు. ఆయన వారి నుంచి ఫోన్ వస్తే భయపడిపోయే పరిస్థితి. కొందరయితే నేరుగా ఢిల్లీ వెళ్లి విజయసాయిరెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి అధికారంలోకి రాకపోవడంతో తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. 23 మంది అప్పటి ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు కూడా స్వీకరించారు. ఇప్పుడు వీరిలో అధికభాగం ఫ్యాన్ నీడకు వచ్చేందుకు తహతహ లాడుతున్నారు.

పార్టీ మారిపోయి….

2014 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలయిన 23 మంది పార్టీ మారడంతో వారి రాజకీయ భవిష్యత్తు మారిపోయింది. ఇందులో కొందరికి టిక్కెట్ దక్కినా ఓటమి పాలయితే, మరికొందరు టిక్కెట్లు దక్కక 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. వైసీపీ అధినేత జగన్ పై నమ్మకం లేక కొందరు, అధికారం కోసం మరికొందరు వైసీపీని వీడారు. పార్టీని వదలి వెళుతూ జగన్ పైనా, వైసీపీపైనా విమర్శలు చేశారు.కొందరు ఏపీలో చంద్రబాబు అభివృద్ధి చూసే వెళుతున్నామని చెప్పారు. జగన్ ను ఏమీ అనకుండా పార్టీ మారిపోయారు.

ఓటమి పాలయి….

2019 ఎన్నికల్లో వీరిలో ఒక్క గొట్టి పాటి రవికుమార్ తప్ప అందరూ ఓటమిపాలయ్యారు. దీంతో వీరిలో అనేక మంది తిరిగి ఫ్యాన్ పార్టీ వైపు వచ్చేందుకు రెడీ అయిపోతున్నారు. వీరికి తెలుగుదేశం పార్టీతో పెద్దగా సంబంధాలేవీ లేవు. తాము పార్టీలోకి వచ్చినా నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్, నేతలు సహకరించలేదన్న అసంతృప్తితో ఉన్నారు. తాజాగా టీడీపీ కూడా అధికారంలోకి రాకపోవడంతో తిరిగి సొంత గూటికి చేరుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నికలకు ముందే వీరిలో కొందరు నేతలు చేరిపోయారు. ఎస్వీ మోహన్ రెడ్డి లాంటి నేతలు ఎన్నికలకు ముందుగానే వైసీపీలోకి వచ్చారు.

విజయసాయితో మంతనాలు….

దీంతో వీరిలో కొందరు నేతలు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి విజయసాయిరెడ్డిని కలసి వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం చెబుతామని ఆయన వారికి భరోసా ఇచ్చినట్లు సమాచారం. తమను పార్టీలోకి తీసుకున్నా ఎలాంటి పదవులను ఆశించమని, పార్టీ పటిష్టతకు పనిచేస్తామని చెప్పారు. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నేతలు విజయసాయిరెడ్డిని కలసిన వారిలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో జగన్ కూడా వీరి చేరికలపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద 23 మందిలో దాదాపు పదిహేను మంది తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

Tags:    

Similar News