ప‌శ్చిమ తీర్పు వ‌న్ సైడ్ కాదా… వైసీపీకి ఇక్కడ షాకులు త‌ప్పవా?

ఏపీలో పంచాయతీ ఎన్నిక‌ల సంగ్రామానికి తెర తొల‌గింది. ర‌ణ‌రంగంలో అభ్యర్థులు పోరాటానికి రెడీ అవుతున్నారు. మొత్తం నాలుగు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి [more]

Update: 2021-02-04 15:30 GMT

ఏపీలో పంచాయతీ ఎన్నిక‌ల సంగ్రామానికి తెర తొల‌గింది. ర‌ణ‌రంగంలో అభ్యర్థులు పోరాటానికి రెడీ అవుతున్నారు. మొత్తం నాలుగు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో పంచాయ‌తీ పోరు ఎలా ఉంటుంది ? గ్రామీణ ఓట‌రు తీర్పు ఎలా ఉండ‌బోతోంది ? ఎమ్మెల్యేల త‌ల‌రాత‌ల‌ను ఎలా డిసైడ్ చేయ‌బోతోంద‌న్నదన్న దానిపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చలే న‌డుస్తున్నాయి. 2013 పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో నాడు టీడీపీ ప్రతిప‌క్షంలో ఉన్నా మెజార్టీ స్థానాలు టీడీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. ఆ ఎన్నిక‌ల‌కు కొద్ది రోజుల ముందే చంద్రబాబు మీకోసం యాత్ర చేయ‌డంతో ఆ ప్రభావం గ‌ట్టిగా ప‌డ‌డంతో మెజార్టీ స్థానాల్లో టీడీపీ విజ‌యం సాధించింది. పైగా పార్టీ 2004, 2009 సాధార‌ణ ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఓడిపోయినా నాడు పార్టీ కేడ‌ర్ క‌సితో ప‌నిచేసి పంచాయ‌తీల్లో ప‌సుపు జెండా రెప‌రెప‌లాడేలా కృషి చేసింది.

ఎనిమిదేళ్ల తర్వాత….?

క‌ట్ చేస్తే 2013 త‌ర్వాత ఇప్పుడు ఎనిమిదేళ్ల విరామంతో పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత న‌వ్యాంధ్రలో జ‌రుగుతోన్న తొలి పంచాయ‌తీ ఎన్నిక‌లు ఇవే కావ‌డం విశేషం. విచిత్రం ఏంటంటే 2013లో ప్రతిప‌క్షంలో ఉండి పంచాయ‌తీ ఎన్నిక‌లు ఎదుర్కొన్న టీడీపీ ఇప్పుడు మ‌ళ్లీ ప్రతిప‌క్షంలో ఉండే ఈ ఎన్నిక‌ల‌కు ఎదుర్కొంటోంది. అయితే నాడు కాంగ్రెస్ టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటే… నేడు వైఎస్సార్‌సీపీని ఢీకొట్టబోతోంది. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో అన్ని ప‌ల్లెల్లోనూ వైసీపీకి ప్రజ‌లు ఏక‌ప‌క్షంగా ప‌ట్టంక‌ట్టారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్ల‌లోనే టీడీపీకి ఎక్కువ ఓట్లు ప‌డ్డాయి. అన్ని పట్టణాల్లోనూ వైసీపీకి టీడీపీ బ‌ల‌మైన పోటీ ఇచ్చింది.

చెమటోడ్చక తప్పదా?

గ్రామీణ ఓట‌రు మాత్రం వ‌ర్గాలు, కులాలు, మ‌తాల‌తో సంబంధం లేకుండా ఫ్యాన్‌ను గిరాగిరా తిప్పేశారు. మ‌రి ఈ సారి ఇక్కడ పోటీ ఎలా ఉండ‌బోతోంద‌న్నదే ఆస‌క్తిగా మారింది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో పాల‌కొల్లు, ఉండి నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా అన్ని సీట్లు గెలుచుకున్న వైసీపీ ఈ సారి పంచాయ‌తీ పోరులో చ‌మ‌టోడ్చక త‌ప్పని ప‌రిస్థితి. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లోని నియోజ‌క‌వ‌ర్గాలు అయిన చింత‌ల‌పూడి, గోపాల‌పురం, కొవ్వూరు, పోల‌వ‌రంతో పాటు ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఫ్యాన్స్ స్పీడ్‌కు ఖ‌చ్చితంగా బ్రేకులు ప‌డే సూచ‌న‌లు ఉన్నాయి. ఉంగుటూరు, గోపాల‌పురం, దెందులూరు లాంటి చోట్ల ప్రతిప‌క్షంలో ఉన్నా టీడీపీ ఇన్‌చార్జ్‌లు క్రమం త‌ప్పకుండా ప్రజ‌ల్లోనే ఉంటూ వారికి అందుబాటులో ఉంటున్నారు.

పోరు హోరా హోరీ…

ఓవ‌రాల్‌గా మెట్ట ప్రాంతంలో సామాజిక స‌మీక‌ర‌ణ‌లు కావొచ్చు.. టీడీపీకి సానుకూల వాతావ‌ర‌ణం ఉంది. త‌ణుకుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ఉండి, పాల‌కొల్లులో కూడా వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య హోరాహోరీ పోరు న‌డుస్తోంది. ఆచంట‌లో పంచాయ‌తీ పోరును మంత్రి రంగ‌నాథ‌రాజు, మాజీ మంత్రి పితాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రంగ‌నాథ‌రాజుపై సొంత పార్టీలో ఉన్న వ్యతిరేక‌త‌ను క్యాష్ చేసుకుని పై చేయి సాధించాల‌ని పితాని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. న‌ర‌సాపురం, భీమ‌వ‌రం , తాడేప‌ల్లిగూడెం లాంటి చోట్ల టీడీపీ ఇన్‌చార్జ్‌లు కాడి కింద ప‌డేసిన ప‌రిస్థితి. పైగా ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ జ‌న‌సేన + బీజేపీ ఈక్వేష‌న్ టీడీపీ ఓటుబ్యాంకుకు భారీగా గండికొట్టనుంది.

సాధారణ ఎన్నికలంత…?

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నియోజ‌క‌వ‌ర్గం ఎక్కువుగా కార్పొరేష‌న్లో ఉండ‌డంతో ఆయ‌న‌కు పంచాయ‌తీ ఎన్నిక‌ల టెన్షన్ పెద్దగా లేదు. ఇక టీడీపీలో ఏలూరు పార్లమెంట‌రీ పార్టీ అధ్యక్షులు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులు, మాజీ విప్ చింత‌మ‌నేని ప్రభాక‌ర్ ఈ ఎన్నిక‌ల‌ను త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రతిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఇక రాజ‌ధాని మార్పుతో పాటు అధికార పార్టీపై కొన్ని వ‌ర్గాల్లో ఉన్న వ్యతిరేక‌త నేప‌థ్యంలో ఈ సారి ప‌శ్చిమ పంచాయ‌తీ పోరు వైసీపీకి సాధార‌ణ ఎన్నిక‌లంత వీజీ కాదు.

Tags:    

Similar News