విశాఖలో పట్టు జార్చేస్తున్న వైసీపీ ?

వైసీపీని నమ్మి ఒక్క విశాఖ సిటీ తప్ప మొత్తానికి మొత్తం విశాఖ జిల్లా అంతటా గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు. జగన్ [more]

Update: 2020-12-06 02:00 GMT

వైసీపీని నమ్మి ఒక్క విశాఖ సిటీ తప్ప మొత్తానికి మొత్తం విశాఖ జిల్లా అంతటా గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు. జగన్ ప్రభంజనం నాడు కొనసాగుతోంది. ఎవరు ఎమ్మెల్యే అభ్యర్ధి అని కూడా చూడకుండా ఓటేయడమే కాకుండా భారీ మెజారిటీలు కూడా అందించారు. అయితే ఏడాదిన్నర కాలం తిరిగేసరికి ఇపుడు ఆ మోజు ఉందా, అక్కడ ఫ్యాన్ ఇంకా గిర్రున అదే స్పీడ్ తో తిరుగుతుందా అంటేనే డౌటే వస్తోంది. చాలా నియోజకవర్గాలలో వర్గ పోరు గుప్పుమంటోంది. ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారు చేస్తున్న పెద్దన్న రాజకీయాల‌తో క్యాడర్ దూరమవుతోంది. లీడర్ల మధ్యన పోరు ఒక్క లెక్కన సాగుతోంది.

కొట్టుకుంటున్నారుగా…?

విశాఖ సిటీలో భాగంగా ఉన్న గాజువాక నియోజకవర్గం గత ఎన్నికల్లో ఏపీ లెవెల్లో మారుమోగింది. దానికి కారణం సినీ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడం. జగన్ ఒకే ఒక్క మీటింగ్ పెట్టి రియల్ స్టార్ తమ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆయనకు ఓటు చేయాలని ఇచ్చిన పిలుపుతో జనం అటే మొగ్గు చూపారు. పవన్ ని ఓడించి నాగిరెడ్డి రియల్ హీరో అయ్యారు. మరిపుడు ఆ పట్టు గాజువాకలో ఉందా అంటే నిరాశే సమాధానం అవుతుంది. ఎవరినీ పట్టించుకోకుండా నాగిరెడ్డి ఏకపక్షంగా వెళ్తున్నారు. ఆయన తన వారసుడిగా కుమారుడు దేవాన్ష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించేశారు. దాంతో పార్టీ కకావికలం అయింది. ఇక ఎన్నో గ్రూపులు, గొడవలు. పైచేయి కోసం బహిరంగానే కొట్టుకుంటూ పార్టీ పరువు బజారుకు ఈడుస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఒకరికి టికెట్ ఇస్తే రెండవ వర్గం వారు ఓడిస్తామని మీడియా ముందే చెబుతున్నారంటే ఇక వైసీపీ సంగతి ఏంటో అర్ధం చేసుకోవాలిగా.

వారే మోజు అట…..

ఇక పెందుర్తి నియోజకవర్గంలో యువ ఎమ్మెల్యే అదీప్ రాజు హవా చాటుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఓ సాధారణ నాయకుడు. జగన్ ఆయన్ని చేరదీసి ఎమ్మెల్యేని చేశారు. మరి అదీప్ రాజు రాజకీయంగా సీనియర్, మాజీ మంత్రి అయిన బండారు సత్యనారాయణమూర్తిని ఓడించి రికార్డు సృష్టించారు. ఇక ఆయన ఎమ్మెల్యే అయ్యాక అసలైన వైసీపీ నేతలను పక్కన పెట్టి తెలుగుదేశం వారికి పెద్ద పీట వేస్తున్నారని క్యాడర్ వాపోతోంది. తాజాగా ఒక సీనియర్ కార్యకర్త పార్టీలో నిరాదరణ భరించలేక అనారోగ్యం తెచ్చుకుని మరీ కన్ను మూశారు. దానికి కారణం ఎమ్మెల్యే అంటూ సొంత పార్టీవారే ఆయన పరామర్శను అడ్డుకుని రచ్చ చేశారంటే పార్టీ పరువు ఎక్కడ ఉంది అన్నది సగటు కార్యకర్తల ఆవేదనగా ఉంది.

ఓ వేలు ఇటేనా..?

విశాఖలో భూ కబ్జాలు పెరిగిపోయాయని వైసీపీ అంటోంది. టీడీపీని టార్గెట్ చేసి ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అయితే అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేల మీద ఇలాంటి ఆరోపణలే జిల్లా అంతటా ఉన్నాయి. దీని మీద విజయసాయిరెడ్డి తీరు మార్చుకోమని తమ పార్టీ వారిని హెచ్చరించినా ఎవరూ స్పందించలేదు సరికదా టీడీపీకి దొరికిపోయేలా వ్యవహరిస్తున్నారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో భూ దందాలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. సర్వే నంబర్లూ సాక్ష్యాధారాలతో సహా బయట పెడుతోంది. మొత్తానికి తొందరలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్న వేళ పార్టీని పక్కన పెట్టి సొంత పనులతో అధికార పార్టీ పెద్దలు బిజీగా ఉన్నారన్నది వాస్తవం. ఇలాగైతే గత సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ ఈసారి తిరగబడుతుందని విశ్లేషణలు అయితే గట్టిగానే ఉన్నాయి.

Tags:    

Similar News