విశాఖ మేయర్ బరువు… విజయసాయిరెడ్డి పరువు…?

విశాఖ మేయర్ పీఠం పట్టాలన్నది వైసీపీ టార్గెట్. విశాఖ ఏడేళ్ళుగా వైసీపీని ఒక్కలా ఏడిపించడంలేదు. ముచ్చటపడి వైఎస్ విజయమ్మను 2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటుకు పోటీ [more]

Update: 2021-03-11 08:00 GMT

విశాఖ మేయర్ పీఠం పట్టాలన్నది వైసీపీ టార్గెట్. విశాఖ ఏడేళ్ళుగా వైసీపీని ఒక్కలా ఏడిపించడంలేదు. ముచ్చటపడి వైఎస్ విజయమ్మను 2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటుకు పోటీ పెడితే లక్ష ఓట్ల తేడాతో బీజేపీ చేతుల్లో ఓడించింది విశాఖ. ఇక 2019 నాటికి ఏపీ మొత్తం వైసీపీ గాలి ఒక్క లెక్కన ఊపేసినా కూడా విశాఖ ఉక్కులా ఎక్కడా చెక్కు చెదరలేదు. నగరం నాలుగు దిక్కులలోనూ సైకిలెక్కి కూర్చుంది. ఇక లాభం లేదని జగన్ విశాఖనే పాలనా రాజధానిగా ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో బలమైన టీడీపీ నేతలను ఫ్యాన్ పార్టీ నీడకు చేర్చారు. ఎన్ని ఎత్తులు వేయాలో అన్నీ వేస్తూ వైసీపీ పదునైన వ్యూహాలనే రచించింది.

గెలిచి తీరాల్సిందే…?

ఇదిలా ఉంటే విశాఖ కార్పోరేషన్ ఎన్నికలు అలా అకస్మాత్తుగా వచ్చి పడ్డాయి. వైసీపీ పెద్దల ఆలోచన అయితే విశాఖకు ఎంతో కొంత మేలు చేసే కార్యక్రమాలు చేపట్టిన తరువాత ఎన్నికలకు వెళ్లాలని అనుకున్నారు. కానీ ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో వచ్చిన లడాయి కాస్తా అన్ని ఎన్నికలనూ ముందుకు తోసుకువచ్చేలా చేసింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీ ఎన్నికలను ఎదుర్కోంటోంది. జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం వైసీపీకి ఇదే ఫస్ట్ టైమ్. దాంతో క్షేత్ర స్థాయిలో ఇప్పటికీ బలంగా ఉన్న టీడీపీని ఢీ కొట్టాల్సివస్తోంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ మేయర్ సీటుని గెలిచి తీరాల్సిందేనని జగన్ హుకుం జరీ చేయడంతో విశాఖ వైసీపీ నేతలు రంగంలోకి దిగిపోయారు.

భుజాన మోస్తున్నారుగా..?

ఇక విశాఖలో వైసీపీ తరఫున మేయర్ ఎన్నికల బాధ్యతలను మొత్తానికి మొత్తం ఎంపీ విజయసాయిరెడ్డి మోస్తున్నారు. ఆయన ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాతిక కిలోమీటర్ల పాదయాత్ర చేయడం ద్వారా క్యాడర్ ని ఒక్కసారిగా తట్టి లేపారు. ఇపుడు వార్డుల వారీగా పాదయాత్రలు చేస్తూ పార్టీని విజయపధాన నడిపించారు. ఎక్కిడికక్కడ పార్టీని సమన్వ్యయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక విశాఖలో వైసీపీని ఏకత్రాటిపైన తీసుకురావడంలో ఆయన విజయం సాధించారనే చెప్పాలి. అయితే విశాఖలో అభివృద్ధి లేమి అన్నదే అతి పెద్ద ప్రశ్నగా మారుతోంది. పైగా టీడీపీకి వార్డు స్థాయిలో ధీటైన నాయకులు అడుగడుగునా ఉన్నారు. వారికి పోటీగా వైసీపీని బరిలోకి దించడం అతి పెద్ద కసరత్తుగానే ఉంది.

తేడా వస్తే ఇంతేనా…?

ఇక విజయసాయిరెడ్డి మీదనే జగన్ భారమంతా మోపారు. జగన్ కి కుడిభుజంగా ఉన్న సాయిరెడ్డి కచ్చితంగా మేయర్ సీటుని గెలిపించుకుని వస్తారని అంతా నమ్ముతున్నారు. విజయసాయిరెడ్డి ఈ గెలుపుని ఒక సవాల్ గా తీసుకున్నారు. తేడా వస్తే మాత్రం ఇన్నేళ్ల విజయసాయిరెడ్డి శ్రమతో పాటు, ఆయన పరువు కూడా పోవడం ఖాయమన్న మాట వైసీపీలో వినిపిస్తోంది. దాంతో నెల్లూరు రెడ్డి గారు మండు టెండలలో కూడా నగర వీధులలో తిరుగుతూ బాగానే చమటోడ్చారు. విశాఖ కార్పోరేషన్ లో ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 113 మంది సభ్యులు ఉంటారు. మేయర్ పీఠాన్ని పట్టాలంటే మ్యాజిక్ 57. వైసీపీ ఈ రేర్ ఫీట్ ని సాధించడానికి గట్టిగానే కృషి చేస్తోంది. 2016 నుంచి విశాఖ రాజకీయాలపైన దృష్టి పెట్టిన విజయసాయిరెడ్డి అనితర సాధ్యమైన విజయాలను పార్టీకి 2019 ఎన్నికల్లో అందించారు. కానీ విశాఖ సిటీని గెలవడం మాత్రం టఫ్ జాబ్ అంటున్నారు. అది కనుక సాధిస్తే సాయిరెడ్డి మంత్రాంగానికి తిరుగులేదని చెప్పేయవచ్చుట.

Tags:    

Similar News