వైసీపీలో కొత్త వివాదం… అంతా టెన్షన్‌.. టెన్షన్ ?

విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల విష‌యం అధికార పార్టీ వైసీపీలో మ‌రో వివాదానికి దారితీసిందా ? రెండు కీల‌క విష‌యాలు ఎన్నిక‌ల్లో వైసీపీకి దెబ్బేస్తాయన్న ఆందోళ‌న ఆ పార్టీ [more]

Update: 2021-03-05 12:30 GMT

విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల విష‌యం అధికార పార్టీ వైసీపీలో మ‌రో వివాదానికి దారితీసిందా ? రెండు కీల‌క విష‌యాలు ఎన్నిక‌ల్లో వైసీపీకి దెబ్బేస్తాయన్న ఆందోళ‌న ఆ పార్టీ నేత‌ల్లో ఉందా ? ఈ ఎన్నిక‌లు ఇద్దరు కీల‌క నాయ‌కుల మ‌ధ్య వివాదానికి కార‌ణ‌మ‌య్యాయా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఇదే విష‌యం వైసీపీలోనూ గుసగుస‌గా వినిపిస్తోంది. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే కార్పొరేష‌న్ ఎన్నిక‌లు మొద‌ల‌య్యాయి. ప్రచార పర్వం కూడా కొన‌సాగుతోంది. ఇప్పుడు విశాఖ‌లో ఎలా ముందుకు వెళ్లాలి ? ఇక్కడి ప్రజ‌ల‌కు ఏం చెప్పాలి ? అనే విష‌యంపై చ‌ర్చ సాగుతోంది. రాజ‌ధాని వ‌స్తుంద‌ని.. అభివృద్ధి సాగుతుంద‌ని..గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రచారం చేశారు.

ఏడాది క్రితం….

అయితే అనూహ్యంగా అప్పట్లో ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. దీంతో ఈ విష‌యం మంచి దూకుడుగా ప్రచారంలో ఉన్న స‌మ‌యంలో నాయ‌కులు ఒక్కసారిగా షాక్‌కు గుర‌య్యారు. అప్పట్లోనే ఎన్నిక‌లు జ‌రిగి ఉంటే.. ఖ‌చ్చితంగా విశాఖ కార్పొరేష‌న్ త‌మ‌కు ద‌క్కి ఉండేద‌ని అనేవారు. విశాఖ మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకునేందుకు జ‌గ‌న్ ఎన్నో రిస్క్‌లు చేయ‌డంతో పాటు ఎన్నో సంల‌చ‌న నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. రాజ‌ధాని వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. హైకోర్టులో దాఖ‌లైన కేసులు అలానే పెండింగులో ఉన్నాయి. ఇవి ఎప్పటికి తేల‌తాయ‌నే విష‌యం ఎవ‌రూ చెప్పలేక పోతున్నారు.

భ్రమల్లోనే ఉంచుతారా?

తాజాగా విశాఖ ఉక్కు విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో ఎలా ముందుకు సాగాల‌నే విష‌యం వైసీపీలో చ‌ర్చకు దారితీస్తోంది. పోనీ రాజ‌ధాని వ‌స్తుంద‌ని చెబితే.. ఇప్పటి వ‌ర‌కు ఏమీ చేయ‌లేక పోవ‌డం.. రెండేళ్లు పూర్తవ‌డం వంటి నేప‌థ్యంలో దీనిని ప్రజ‌ల‌ను న‌మ్మించ‌డం అంత సాధ్యం కాద‌ని అంటున్నారు. విశాఖ‌కు రాజ‌ధాని అదిగో వ‌చ్చేస్తోంది.. ఇదిగో వ‌చ్చేస్తోందంటూ వైసీపీ నాయ‌కులు ఇక్కడ జ‌నాల‌ను ఊరించ‌డ‌మే త‌ప్ప న‌మ్మించ‌లేక‌పోతున్నారు. చంద్రబాబు అమ‌రావ‌తిని క‌ట్టేస్తానంటూ ఐదేళ్ల పాటు అక్కడ ప్రజ‌ల‌ను భ్రమ‌ల్లో ఉంచ‌డం వ‌ల్లే గ‌త ఎన్నికల్లో ఆ ప్రాంత ప్రజ‌లు కూడా బాబును న‌మ్మలేదు. మ‌రో మూడేళ్ల పాటు వైసీపీ రాజ‌ధాని విష‌యంలో విశాఖ ప్రజ‌ల‌ను జ‌గ‌న్ కూడా నాడు బాబులాగే భ్రమ‌ల్లో ఉంచుతున్నారా ? అన్న సందేహాలు కూడా మొద‌ల‌య్యాయి.

ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ….

ఇక‌, ఉక్కు ప‌రిశ్రమ ప్రైవేటు విష‌యంలోనూ ఇత‌మిత్థంగా ఏమీ చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. ఎందుకంటే.. ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు ఉద్దేశించి జ‌రిగిన చ‌ర్చలు.. వేసిన క‌మిటీలో వైసీపీ ఎంపీనే ఉండ‌డం.. ఏడాది కింద‌టే ఈ విష‌యం వైసీపీకి తెలిసినా..ఏమీ చేయ ‌కుండా మౌనం పాటించ‌డం వంటి కార‌ణాల నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు ప్రజ‌ల్లోకి వెళ్లేందుకు స‌బ్జెక్ట్ ల‌భించ‌డం లేద‌ని అంటున్నారు. దీనికి తోడు ఇక్కడ సాయిరెడ్డి దూకుడు అటు సొంత పార్టీ ఎంపీకి గాని.. మంత్రికి..వైసీపీ ఇత‌ర ప్రజా ప్రతినిధుల‌కు రుచించ‌డం లేదు. కొన్ని కార్పొరేట‌ర్ల ఎంపిక‌లో సాయిరెడ్డి నేరుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవ‌న్నీ గ్రేట‌ర్ విశాఖ వార్‌లో వైసీపీని ఏ తీరాల‌కు చేరుస్తాయో ? అన్న సందేహాలు సొంత పార్టీ నేత‌ల్లోనే ఉన్నాయి.

Tags:    

Similar News