అక్కడ వైసీపీకి వార్నింగ్ బెల్స్… ?

ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాలే టీడీపీకి మాడు మీద గట్టిగా కొట్టాయి. పార్టీ పెట్టాక పుట్టాక కనీ వినీ ఎరుగని ఘోర పరాభవం 2019 ఎన్నికల్లో టీడీపీకి ఎదురైంది. [more]

Update: 2021-09-12 13:30 GMT

ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాలే టీడీపీకి మాడు మీద గట్టిగా కొట్టాయి. పార్టీ పెట్టాక పుట్టాక కనీ వినీ ఎరుగని ఘోర పరాభవం 2019 ఎన్నికల్లో టీడీపీకి ఎదురైంది. అయితే కాలం ఒక్కలా ఉండదు కదా. ఇపుడు మెల్లగా సీన్ మారుతోంది అంటున్నారు. టీడీపీ నేతల్లో కూడా ధీమా పెరుగుతోంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీ మీద వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది. అదే విధంగా మంద ఎక్కువైతే మఠానికి చేటు అని అన్ని చోట్లా గెలిచినది వైసీపీ వారే. దాంతో ప్రజల సమస్యలు పెరుగుతున్నాయి. దానికి తగినట్లుగా వైసీపీ నేతలు స్పందించకపోతే జనాలకు కోపమే వస్తుంది.

మెజారిటీ తగ్గుతోంది …

ఇక చూసుకుంటే 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లో వైసీపీ మొత్తం 34 ఎమ్మెల్యే సీట్లకు గానూ 28 గెలుచుకుంది. అలాగే అయిదు ఎంపీ సీట్లు ఉంటే నాలుగు గెలిచి ప్రజా తీర్పు ఏకపక్షమని చాటి చెప్పింది. ఈ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వైసీపీ జోరు బాగానే సాగింది. కానీ రెండవ విడత కరోనా తరువాత కొంత మార్పు కనిపిస్తోంది. నిత్యావసరాలు పెరగడం, నిరుద్యోగం, అభివృద్ధి లేకపోవడం వంటివి జనాల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇందులో కొన్ని కేంద్రం తప్పులు అయినా కూడా సామాన్యులకు ఎదురుగా ఉన్నది వైసీపీ కాబట్టి అది ఈ సర్కార్ కే శాపంగా మారుతోంది. దాంతో గత ఎన్నికల్లో ఆరు సీట్లకే పరిమితం అయిన టీడీపీ ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఆ సంఖ్యను రెట్టింపు చేసుకుంటుంది అంటున్నారు. అంటే వైసీపీకి వచ్చిన 28 సీట్లలో ఆరేడు సీట్లు తగ్గిపోతయన్న మాట.

ఫోకస్ పెంచాల్సిందే…?

వైసీపీ సంస్థాగతంగా పడకేసింది. ఎన్ని పదవులు జగన్ నాయకులకు ఇచ్చినా వారు జనాల్లోకి మాత్రం రావడం లేదు. మూడు జిల్లాల్లో ఎక్కడ చూసినా పార్టీ ఆఫీసులు బోసి పోయి ఉంటున్నాయి. మాకెందుకు అన్నట్లుగానే నేతలు ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మౌన రాగాలతో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహం కలిగేలా చేస్తున్నారు. ఇక పధకాల విషయంలో కూడా అందరికీ అందకుండా తర తమ భేదాలు సాగుతున్నాయి. పైన జగన్ రాజకీయాలకు అతీతంగా అంటూ ఎన్ని చెప్పినా దిగువ స్థాయిలో మాత్రం జరగాల్సిన రాజకీయం సాగుతోంది. దీంతో ఉత్తరాంధ్రాలో అధికార పార్టీ పట్ల కొంత వ్యతిరేకత పెరుగుతోంది. ఇక ఈ మధ్య కాలంలో ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పార్టీని పట్టించుకోవడం మానేశారు. దాంతో వర్గ పోరు కూడా పెరిగిపోతోంది. దీంతో ఇక కచ్చితంగా ఫోకస్ పెట్టాల్సిందే అని అధినాయకత్వం నిర్ణయానికి వచ్చింది అంటున్నారు.

అదే మందు ….

పార్టీ కమిటీలు కొత్తగా ఎక్కడికక్కడ వేయడం, ప్రభుత్వ కార్యక్రమాలను విరివిగా ప్రచారం చేసుకోవడం వైసీపీ త్వరగా చేయాల్సిన పని అంటున్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హానీమూన్ మూడ్ నుంచి బయటకు వచ్చి ప్రజలకు చేరువ కావాలని సూచనలు అందుతున్నాయి. తెలుగుదేశం ఈ మధ్య బాగా రీఛార్జి అయింది. ప్రతీ రోజూ ఏదో ఒక నిరసన, ఆందోళనతో జనంలోకి వస్తున్నారు. ప్రెస్ మీట్లు, ప్రకటనలు వీటిని అదనంగా ఉంటున్నాయి. దాంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు చేస్తున్న ప్రచారం జనాల మెదళ్ళలోకి వెళ్ళిపోతోంది. దాన్ని కౌంటర్ చేసేలా వైసీపీ వ్యూహాలను రూపొందించుకోవాలని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే మెజారిటీ సీట్లు వైసీపీకే ఉన్నాయి. కానీ వైసీపీ ఇలాగే తగ్గి ఉంటే మాత్రం ముందు ముందు భారీ రాజకీయ మార్పు ఉత్తరాంధ్రా నుంచే మొదలవుతుంది అన్న వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. సో వైసీపీ హైకమాండ్ తస్మాత్ జాగ్రత్త అనాలి.

Tags:    

Similar News