మంత్రితో ఎమ్మెల్యే మిలాఖ‌త్‌.. అందుకే ఇంత మౌన‌మా..?

వంద త‌ప్పులు చేసినా ఫ‌ర్లేదు కానీ.. ఒక్క ఆరోప‌ణా బ‌య‌ట‌కు రాకుండా చూసుకోవ‌డం రాజ‌కీయాల్లో నేత‌ల‌కు వెన్నతోపెట్టిన విద్య. ఒక‌వేళ ప్రతిప‌క్షాలు ఆరోపించినా.. విమ‌ర్శలు గుప్పించినా.. ప‌నికిమాలిన [more]

Update: 2020-11-22 14:30 GMT

వంద త‌ప్పులు చేసినా ఫ‌ర్లేదు కానీ.. ఒక్క ఆరోప‌ణా బ‌య‌ట‌కు రాకుండా చూసుకోవ‌డం రాజ‌కీయాల్లో నేత‌ల‌కు వెన్నతోపెట్టిన విద్య. ఒక‌వేళ ప్రతిప‌క్షాలు ఆరోపించినా.. విమ‌ర్శలు గుప్పించినా.. ప‌నికిమాలిన రాజ‌కీయాలంటూ.. ఎదురు దాడి చేయ‌గ‌లిగితే.. చాలు నేత‌ల‌కు సేఫ్‌. అయితే.. వైసీపీలో మాత్రం ఈ త‌ర‌హా వ్యూహం క‌నిపించ‌డం లేద‌న్న విష‌యం తెలిసిందే. ఎక్కడిక‌క్కడ మంత్రుల‌పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల‌పై ద్వితీయ శ్రేణి నేత‌లు, ఎంపీల‌పై ఎమ్మెల్యేలు.. ఇలా ఒక‌రిపై ఒక‌రు ప‌డి విమ‌ర్శలు గుప్పించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి మొద‌లు పెడితే వైజాగ్‌, గోదావ‌రి జ‌ల్లాలు, గుంటూరు, నెల్లూరు, సీమ జిల్లాల్లో ఇదే ప‌రిస్థితి ఉంది. ప‌లు నియోజ‌కవ‌ర్గాల్లో నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌లు ముదిరి పాకాన ప‌డి పార్టీ ప‌రువు బ‌జారున ప‌డుతోంది. దీంతో వైసీపీ నేత‌ల‌పై రోజుకో వార్త తెర‌మీదికి వ‌స్తోంది.

ఈ జిల్లాలో మాత్రం…

అయితే, అనూహ్యంగా కృష్ణాజిల్లాలో మాత్రం ఇలాంటి విమ‌ర్శలు లేవు. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు లేవు. ఒక‌రిపై ఒక‌రు దూషించుకోరు. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శలు చేసుకోరు. అధిష్టానానికి కూడా కంప్లెయింట్స్ లేవు. మొత్తంగా కృష్ణా జిల్లాలో వైసీపీ మంత్రులు.. నాయ‌కులు ఎక్కడా క‌ల‌హించుకోవ‌డం, పైచేయి సాధించుకోవ‌డం.. ఆధిప‌త్య పోరు వంటి వాటికి క‌డు దూరంలో ఉన్నారు. అయితే.. ఇది నిజం కాదు. వైసీపీలో సీనియ‌ర్లు చ‌ర్చించుకుంటున్న విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. కృష్ణాలో ఏం జ‌రుగుతోందో అర్ధమ‌వుతుంది. దీనికి రీజ‌న్‌.. మంత్రులు-ఎమ్మెల్యేలు రాజీ ధోర‌ణిలో ముందుకు సాగుతున్నారు.

రాజీ పడుతూ…..

“ఒక్క మాజిల్లాలోనే కాదు.. అన్ని జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. అయితే.. అక్కడ రాజీ ప‌డుతున్నారు. ఇక్కడ మావోళ్లు ప‌డ‌డం లేదు!“-ఇదీ సీమ జిల్లాల‌కు చెందిన వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. పార్టీ నేత‌ల పంప‌కాల‌పై చేసిన కీల‌క వ్యాఖ్య. ఇది సాక్షాత్తూ కృష్ణా జిల్లాకు వ‌రిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రీ ముఖ్యంగా క‌మ్మ వ‌ర్గానికి చెందిన నాయ‌కులు రాజీ ప‌డుతున్నార‌ని.. ఒక‌రి ప్రాంతంలో జ‌రుగుతున్న అక్రమాల‌కు మ‌రొక‌రి మ‌ద్దతు ఉంద‌ని.. దూకుడు కూడా అదేవిధంగా ఉంద‌ని.. దీంతో వివాదాలు రాకుండా జాగ్రత్త ప‌డుతూ.. పంచుకుంటున్నార‌ని అంటున్నారు.

మంత్రితో ఒప్పందం…

ఈ విష‌యంలో జిల్లాలో గ‌తంలో ఓ మంత్రిని ఓడించిన క‌మ్మ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కుడు.. ఇదే జిల్లాలో మంత్రితో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నార‌ని సీనియ‌ర్లు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. స‌ద‌రు ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గంలో గ‌తంలో మంత్రిగా ఉన్న నేత‌పై వైసీపీ నేత‌లు తీవ్రమైన ఆరోప‌ణ‌లు చేశారు. ఇప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఎమ్మెల్యే అక్రమంగా గ్రావెల్‌, మ‌ట్టి అమ్మేసుకుంటున్నార‌ట‌. ఇందుకు ఈ జిల్లాకే చెందిన త‌న సామాజిక వ‌ర్గ మంత్రి సాయం తీసుకుని.. ఇబ్బంది లేకుండా చేసుకోవ‌డంతో పాటు స‌ద‌రు మంత్రికి కొంత వాటిని పంపించేస్తున్నార‌ట‌. ఈ గుట్టును రేపో మాపో టీడీపీ నేత‌లు ర‌ట్టు చేసేందుకు కాచుకుని ఉన్నారు. మొత్తంగా చూస్తే.. కృష్ణా జిల్లాలో త‌మ నేత‌లు బ‌య‌ట ప‌డ‌కుండా అండ‌ర్ స్డాండింగ్‌తో పంప‌కాలు చేసుకుంటున్నార‌ని వైసీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు.

Tags:    

Similar News