అక్కడ ఫ్యాన్ తిరిగడం చాలా కష్టమేనట…?

విశాఖ మేయర్ సీటు పట్టడం అన్నది వైసీపీ ముందున్న బిగ్ టాస్క్. గత ఏడాది మార్చిలో అనుకున్నట్లుగా స్థానిక ఎన్నికలు జరిగితే కచ్చితంగా 98 డివిజన్లకు గానూ [more]

Update: 2021-02-16 15:30 GMT

విశాఖ మేయర్ సీటు పట్టడం అన్నది వైసీపీ ముందున్న బిగ్ టాస్క్. గత ఏడాది మార్చిలో అనుకున్నట్లుగా స్థానిక ఎన్నికలు జరిగితే కచ్చితంగా 98 డివిజన్లకు గానూ 70 దాకా వైసీపీకి వచ్చేసేవే. ఆ ఊపు అలాంటిది మరి. నాడు టీడీపీ వారు కనీసం బయటకు రావడానికి కూడా జడుసుకునే సీన్ ఉంది. ఇపుడు చూస్తే మరో ఏడాది దొర్లిపోయింది. జమిలి ఎన్నికల కూత గట్టిగా వినిపిస్తోంది. జగన్ మహా అయితే ఉండేది రెండెళ్ళే అని టీడీపీ అధినేత చంద్రబాబు ఎటూ ధైర్యం చెబుతున్నాడు. దానికి తోడు ఒక్కసారిగా ఏపీలో రాజకీయ పరిణామాలు కూడా మారాయి. ఇవన్నీ తమ్ముళ్ళకు బాగానే టానిక్ గా పనిచేస్తున్నాయి.

ఎన్ని రిపేర్లు చేసినా ..?

జీవీఎంసీ ఎన్నికలలో వైసీపీ పరిస్థితి మీద వరసగా చేయిస్తున్న సర్వేలు ఆ పార్టీ పెద్దలకు షాక్ ఇచ్చేలా ఉన్నాయట. అభ్యర్ధులుగా ఇప్పటికే ప్రకటించిన వారు చేస్తున్న దందాలతో ఎక్కడికక్కడ పార్టీ పరువు పోతోంది. దానికి తోడు వర్గ పోరు తారస్థాయిలో ఉంది. ఇక గత ఏడాది హడావుడిలో చాలా మంది అనర్హులకు కార్పోరేటర్లుగా టికెట్లు ఇచ్చేశారన్నది పెద్దలు గ్రహించారుట. దాంతో వాళ్ళను మార్చేసే రిపేర్లు ఎక్కడికక్కడ మొదలుపెట్టారు. మరి ఈ రిపేర్లు ఏమైనా ఎన్నికల్లో పనిచేస్తాయా అన్నదే చర్చగా ఉంది.

అగ్నికి వాయువుగా…?

అసలే విశాఖ సిటీ రాజకీయాల్లో టీడీపీకి పట్టుంది. అయితే ఎన్నికలు అయిపోయాక జనాలు గ్రహించింది ఏంటి అంటే తాము ఓటేసిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోకి వచ్చారని, దాంతో సహజంగానే అధికార పార్టీ వైపు నగర వాసులు కొంత మొగ్గు చూపారు. దానికి విశాఖ రాజధాని ప్రకటన కూడా కొంత వీలు కల్పించింది. కానీ వైసీపీ నేతల మధ్య విభేదాలు, నాయకుల దూకుడు రాజకీయం పార్టీ పరువుని తీశాయి. ఇక విశాఖలో టీడీపీ స్ట్రాంగ్ బేస్ అలాగే ఉండగానే వైసీపీ మాత్రం కొత్త మోజులోనూ ఎదగలేకపోయింది. ఈ లోగా వైసీపీ సర్కార్ పాలనాపరమైన వైఫల్యాలు సిటీ వాసులను ఆలోచనల్లో పడవేశాయి. దాంతో జీవీఎంసీ ఎన్నికలు వస్తే వారు ఎటు ఎటు వైపు ఓట్లేస్తారు అన్న కంగారు అధికార పార్టీలో ఉంది.

పరువు పోయినట్లే …?

విశాఖలో పెంచిన వార్డులతో కలిపి 98 ఉన్నాయి. ఇందులో మెజారిటీ గెలిచి మేయర్ పీఠం పట్టకుంటే వైసీపీ పరువు పోయినట్లే. ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నా కూడా కనీసం నలభై పై చిలుకు వార్డులు గెలవాలి. ఇపుడు చూస్తే కచ్చితంగా ఫలనా వార్డులో వైసీపీ గెలుస్తుంది అన్న మాట అయితే లేదు. అదే సమయంలో అనేక ఎన్నికల్లో పాల్గొన్న టీడీపీకి గట్టి వార్డులు గెలిచే సీట్లు కొన్ని ఉన్నాయి. మరి ఏ అంచనా మరే వ్యూహం లేకుండా జీవీఎంసీ బరిలోకి దిగితే మాత్రం వైసీపీ పరువు పోవడం ఖాయమని అంటున్నారు. పైగా విశాఖను రాజధానిగా ప్రకటించిన తరువాత గెలుచుకోకపోతే అసలుకే ఎస‌రు వస్తుంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News