జక్కంపూడితో ఢీకొట్టారు.. మరి ఏం జరుగుతుందో?

లాక్ డౌన్ కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి పోటీపడ్డ రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ అసలు పనిలో పడ్డాయి. రాజకీయాలకు పెట్టింది పేరైన గోదావరి తీరం రాజమహేంద్రి [more]

Update: 2020-05-30 08:00 GMT

లాక్ డౌన్ కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి పోటీపడ్డ రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ అసలు పనిలో పడ్డాయి. రాజకీయాలకు పెట్టింది పేరైన గోదావరి తీరం రాజమహేంద్రి లో ఇప్పుడు పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరిపోయింది. ఇందులో అధికారపార్టీలో రెండు గ్రూప్ లు గా ముసుగులో గుద్దులాట మొదలు పెట్టింది. వైసీపీ లో మొదలైన అంతర్గత పోరు అవకాశం గా మలుచుకునేందుకు తెలుగుదేశం పార్టీ తనదైన రాజకీయానికి తెరతీసింది. దాంతో ఎండల వేడి, లాక్ డౌన్ వ్యవహారాలు అన్ని పక్కకు పోయి పొలిటికల్ ఫైట్ పై అంతా ఆసక్తిగా చర్చించుకోవడం స్టార్ట్ అయ్యింది.

వివాదానికి రీజన్ ఏంటి …?

రాజమండ్రిలో సేవా కార్యక్రమాల్లో వైసీపీ లోని రెండు గ్రూప్ లు పోటా పోటీ గా నిర్వహించాయి. ఇక టిడిపి సైతం ఎక్కడ తగ్గలేదు. అధికారపార్టీలో ఎంపి మార్గాని భరత్ రామ్, రాజానగరం ఎమ్యెల్యే జక్కంపూడి రాజా రెండు గ్రూప్ లుగా ఏర్పడ్డారని తేలిపోయింది. కొన్ని ఇద్దరు కలిసి ఒకే వేదికపై కార్యక్రమాల్లో కనిపిస్తున్నా ఆ తరువాత రాజకీయాలు వేరే సాగుతున్నాయి. వీరిద్దరి నడుమ ఆవభూముల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న అంశంపై యుద్ధం మొదలైంది. రైతుల పక్షాన తాను ఉంటానని ముఖ్యమంత్రి దృష్టిలో అన్ని విషయాలు పెడతానంటూ ఇటీవల అధికారుల ప్రకటనకు భిన్నంగా జక్కంపూడి రాజా సంచలన ప్రకటన చేశారు.

అవకాశం అనుకూలంగా మార్చుకున్న విపక్షం …

ఆవభూముల వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయంటూ ఇదే అదనుగా టిడిపి, బిజెపి తదితర విపక్షాలు పెద్దఎత్తునే ఆందోళన మొదలు పెట్టాయి. తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటె బయటపెట్టాలంటూ ఎంపి భరత్ సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంపి భరత్ రామ్ ను ముఖ్యమంత్రి జగన్ మందలించి కొట్టారంటూ కొందరు ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. అది జరిగిన తరువాత రోజే భరత్ తన పుట్టిన రోజు సందర్భంగా సిఎం చేత కేక్ తినిపించుకుని ప్రత్యర్థులకు గట్టి సమాధానమే చెప్పారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ని తన క్యారెక్టర్ లను డ్యామేజ్ చేయడానికి రాజమండ్రిలో కుమ్మక్కు రాజకీయాలు మొదలు అయ్యాయయని ఆరోపించారు. సోషల్ మీడియా లో దురుద్దేశ్యంతో పోస్ట్ లు పెట్టిన వారిపై సిబిసిఐడి కి ఫిర్యాదు చేశారు.

అయ్యన్నపై ఐదు కోట్లరూపాయలకు దావా …

తనను దొంగ గజదొంగ అంటూ వ్యాఖ్యానించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై ఐదు కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయనున్నట్లు వెల్లడించారు. అలాగే తనను విమర్శిస్తున్న చింతకాయ బెండకాయలు ఏ స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చారని తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని రాజకీయాలు చేస్తుంటే కలెక్షన్ల తో సేవా కార్యక్రమాలు చేసిన వారు లెక్కలు చెప్పాలని వారు బ్లేడ్ బ్యాచ్ లను ప్రోత్సహిస్తూ, భూ దందాలు చేస్తున్నారని, మార్కెట్ తరలిస్తామంటూ వ్యాపారుల దగ్గర వసూళ్లకు పాల్పడ్డారని, వైద్యులను సైతం బెదిరించి డబ్బు లు వసూలు చేశారని ఆరోపణలు చేయడం సంచలనం అయ్యింది.

జక్కంపూడి ప్రశ్నలకు జవాబు కోరుతున్న టిడిపి ..

ఎంపి చేసిన ఆరోపణలపై అర్బన్ టిడిపి నేత మాజీ ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు స్ట్రాంగ్ గా స్పందించారు. ఆవ భూముల అంశంలో వైసీపీ ఎమ్యెల్యే జక్కంపూడి రాజా అభియోగాలను వ్యతిరేకిస్తున్నారా ఆమోదిస్తున్నారా అన్నది తేల్చాలని డిమాండ్ చేశారు. రెడ్ జోన్స్ ప్రజలకు నిత్యావసర కిట్ ల కోసం కార్పొరేట్ కంపెనీల నుంచి లక్షలాది రూపాయలు స్వరాజ్య సేవా సంస్థ పేరిట చెక్ లు తీసుకుని ఎంపి తెరచాటు వ్యవహారాలు చాలా చేశారని దీనిపై సమాచార హక్కు చట్టం ద్వారా మొత్తం బహిర్గతం చేస్తామని వెల్లడించారు. ఇసుక దందా వెనుక ఎంపి హస్తం ఉందని ఆరోపించారు. అనుభవం లేని నేత ఒక్కసారిగా ఎంపి కావడంతో ఆయన చేస్తున్న పనుల్లో అన్ని అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు ఆదిరెడ్డి అన్ని ఆధారాలు త్వరలో బయట పెడతామంటూ హెచ్చరిస్తూ ఒక్కసారిగా రాజకీయం వేడెక్కించారు.

సుబ్బారెడ్డే తీర్చాలి …

ఎంపి భరత్ రామ్ పై టిడిపి ఫైర్ అవుతున్న నేపథ్యంలో జక్కంపూడి రాజా వర్గం వేడుక చూస్తుంది. అయితే మొత్తం ఈ వ్యవహారంతో పార్టీలో మాత్రం చర్చ గట్టిగానే నడుస్తుంది. రాజమండ్రిలో నడుస్తున్న ఈ గ్రూప్ రాజకీయాలు మాత్రం అధిష్టానానికి తలనొప్పి మాత్రం తెచ్చిపెడుతున్నాయి. వీరి పంచాయితీలను టిటిడి చైర్మన్ జిల్లా ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డి తీర్చాల్సి ఉంది. ముందు సొంత ఇల్లు చక్క పెట్టిన తరువాతే టిడిపి పై యుద్ధానికి సిద్ధం కావాలిసి ఉన్న నేపథ్యంలో గ్రూప్ ల గోలకు సుబ్బారెడ్డి ఫుల్ స్టాప్ పెట్టగలరో లేక మరింత ఇవి పెరిగే వరకు చూస్తారా ? లేక వైసీపీ అధినేత జగన్ దీనికి పరిష్కారం వెతుకుతారా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News