మనుషులు కలిసారు … మనసులు కలిశాయా …?

ఆ రెండు గ్రూప్ లు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నాయి. ప్రతీ కార్యక్రమం పోటాపోటీగా చేస్తున్నాయి. అధికారపక్షం, ప్రతిపక్షం రెండు వారే అన్నట్లు వర్గ పోరు సాగుతుంది. అనివార్య [more]

Update: 2020-12-20 05:00 GMT

ఆ రెండు గ్రూప్ లు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నాయి. ప్రతీ కార్యక్రమం పోటాపోటీగా చేస్తున్నాయి. అధికారపక్షం, ప్రతిపక్షం రెండు వారే అన్నట్లు వర్గ పోరు సాగుతుంది. అనివార్య పరిస్థితులు ఆ రెండు వర్గాలను ఏకం చేశాయి. జగన్ పుట్టిన రోజు వారోత్సవాల్లో ఈ సందర్భం చోటు చేసుకుంది. రాజమహేంద్రి వేదికగా తలపడుతున్న ఎంపి మార్గాని భరత్ రామ్, రాజానగరం ఎమ్యెల్యే జక్కంపూడి రాజా ఏడాదిగా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా గోదావరి తీరంలో నడుస్తున్నారు. ఆ ఇద్దరు ఇప్పుడు ఒకటై నడిచారు. కార్యకర్తలకు ఈ కలయిక ఆనందాన్ని నింపినా అది ఎంతకాలమో చెప్పలేమంటున్నారు విశ్లేషకులు.

మూడు రోజులు కనిపించని ఎంపి …

ఏపీ ముఖ్యమంత్రి వైసిపి అధినేత వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను రాజమండ్రి అర్బన్, రూరల్, రాజానగరం నియోజకవర్గానికి చెందిన ముగ్గురు నేతలు ఏడు రోజులపాటు భారీ ఎత్తున వారోత్సవాలుగా ఏర్పాటు చేశారు. రాజానగరం ఎమ్యెల్యే జక్కంపూడి రాజా ఆయన కుటుంబం జక్కంపూడి ఫౌండేషన్, అర్బన్, రూరల్ వైసిపి కో ఆర్డినేటర్ లు శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు లు ఈ వారోత్సవాలకు అంకురార్పణ చేశారు. అయితే ఈ కార్యక్రమాల్లో మూడు రోజులపాటు ఎంపి భరత్ రామ్ జాడ లేదు. ఆయనకు ఈ ముగ్గురు ఆహ్వానించింది లేదు. దాంతో ఆయన దూరంగానే ఉన్నారు.

రంగంలోకి అధిష్టానం …

రాజమండ్రి కేంద్రంగా నడుస్తున్న ఈ వర్గపోరు అధిష్టానానికి తలపోటుగా మారింది. దాంతో జగన్ పుట్టిన రోజు వేడుకల మైలేజ్ మాటెలా ఉన్నా పరువు పోయేలా ఉందని గుర్తించింది నాయకత్వం. దాంతో రంగంలోకి దిగి అంతా కలిసే నడవాలని ఆదేశించినట్లు తెలిసింది. డిప్యూటీ సిఎం అంజాద్ బాషా గ్రూప్ ల నడుమ సయోధ్యకు వారధిగా మారారు. ఇరు వర్గాలను రెండు మెగా ఈవెంట్లలో కలిసి నడిచేలా బాషా తెరవెనుక మంత్రాంగం నడిపారు. తూర్పుగోదావరి జిల్లా వైసిపి బాధ్యుడు వైవి సుబ్బారెడ్డి సూచనల మేరకే ప్రస్తుతానికి కథ సుఖాంతం అయినట్లు తెలుస్తుంది.

అంటీముట్టనట్లే …

అధిష్టానం కోసం ఇరు వర్గాలు కలిసినట్లే కలిసినా అంటి ముట్టనట్లే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం కనిపించింది. రాజమండ్రిలో టిడిపి నుంచి వైసిపి లోకి భారీగా వలస వచ్చిన ముస్లిం మైనారిటీ లు నిర్వహించిన కార్యక్రమంలో కానీ ఆ తరువాత అక్క చెల్లెళ్ళ మహా పాదయాత్రలో జగనన్న పుట్టిన రోజు వారోత్సవ కార్యక్రమంలో ఒకే గ్రూప్ గా కనిపించినా దూరంగా సాగిపోవడం గమనార్హం. దాంతో పార్టీ అధిష్టానం మరికొన్ని ప్రయత్నాలు చేయకతప్పేలా లేదు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల లోగా గ్రూప్ ల నడుమ ఐక్యత సాధించకపోతే ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో స్థానికంగా దూసుకుపోతున్న తెలుగుదేశానికి మరో విజయం అప్పగించినట్లే అవుతుందని శ్రేణుల్లో ఆందోళన ప్రస్ఫుటిస్తుంది. అయితే ఏమి జరగనుందో భవిష్యత్ తేల్చనుంది.

Tags:    

Similar News