Badvel : ఈ… పోలింగ్…వైసీపీ ఆశలు గల్లంతయినట్లేగా…?

బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. దాదాపు అరవై శాతానికి పైగానే పోలింగ్ శాతం నమోదయింది. బద్వేలు ఉప ఎన్నిక ఏకపక్షంగానే జరిగిందని చెప్పాలి. విజయాన్ని రాజకీయ [more]

Update: 2021-10-30 14:30 GMT

బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. దాదాపు అరవై శాతానికి పైగానే పోలింగ్ శాతం నమోదయింది. బద్వేలు ఉప ఎన్నిక ఏకపక్షంగానే జరిగిందని చెప్పాలి. విజయాన్ని రాజకీయ పార్టీలన్నీ ముందుగానే అంచనా వేసుకున్నా, పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దాసరి సుధ విజయం దాదాపు ఖాయమైనట్లే. అయితే మెజారిటీ ఎంతనేది తేలాల్సి ఉంది.

లక్ష మెజారిటీ అంటూ…

వైసీపీ నేతలు మాత్రం తమకు లక్ష మెజారిటీ వస్తుందని చెబుతున్నారు. బద్వేలులో మొత్తం 2,37,022 మంది ఓటర్లున్నారు. అంటే దాదాపు 1,30 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లే. అయితే ఇందులో ఎవరికి ఎన్ని ఓట్లు అన్నది నవంబరు 2వ తేదీన తేలాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఆ పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో ఆ ఓట్లు ఎవరికి పడ్డాయన్నది అర్థం కాకుండా ఉంది.

టీడీపీ బీజేపీ వైపు….

తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు లోపాయికారీగా తమ శ్రేణులకు హింట్ ఇచ్చారని చెబుతున్నారు. పోలింగ్ కేంద్రంలో కూడా వారు బీజేపీ ఏజెంట్లుగా దర్శనమివ్వడంతో ఆ ఓట్లన్నీ తమకే పడ్డాయన్న ఆశలో బీజేపీ ఉంది. అదే జరిగితే బద్వేలు ఎన్నికలో బీజేపీకి యాభై వేలకు పైగానే ఓట్లు రావాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ కూడా కాంగ్రెస్ కు మద్దతిచ్చి ప్రయోజనం లేదని భావించి ముందు చూపుతో బీజేపీ వైపు మొగ్గు చూపిందంటున్నారు.

మెజారిటీ తగ్గించే లక్ష్యంగా….

టీడీపీ ఓట్లు సాలిడ్ గా బీజేపీ అభ్యర్థికి పడి ఉంటే వైసీపీ ఆశలు గల్లంతవుతాయి. లక్ష ఓట్ల మెజారిటీ అనేది రాదు. గెలవడం ఖాయమయినా మంత్రులు, ఎమ్మెల్యేలు పెట్టిన ఎఫెర్ట్ కు ఫలితం మాత్రం కన్పించదు. అందుకే వైసీీపీ మెజారిటీ తగ్గించాలనే టీడీపీ ఎన్నికలకు ముందు రెండు రోజుల నుంచి బీజేపీ కే ఓటు వేయాలన్న సంకేతాలను తమ ఓటర్లకు పంపిందంటున్నారు. మొత్తం మీద బద్వేలులో పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే వైసీపీ ఆశలు గల్లంతయినట్లేనని అంటున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపినట్లు కన్పించలేదు.

Tags:    

Similar News